YCP : రాష్ట్రంలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహాలం నెలకొన్నది. కొన్ని గ్రామాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు బలపర్చిన అభ్యర్థుల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొంటుండగా, ఉత్తరాంధ్రలో పరిస్థితి భిన్నంగా ఉంది. అధికార వైసీపికి చెందిన వ్యక్తుల మధ్య ప్రధాన పోటీ జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన నేతలకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్రామాల్లో ఒక వేళ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుడు సర్పంచ్ గా ఎన్నికైతే అభివృద్ధి కుంటుపడుతుందనీ, పనులు జరగవని భావిస్తుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని తెలుగుదేశం పార్టీ నేతల పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది. సీనియర్ టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులనే కేసుల్లో అరెస్టు చేస్తుంటే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయుకులు కొందరు సైలెంట్ అయిపోగా కొందరు అధికార పార్టీలోకి జంప్ చేసి వారి పనులను చక్కబెట్టుకుంటున్నారు.
అయితే చాలా ప్రాంతాల్లో వైసీపీలో మొదటి నుండి ఉన్న వాళ్లకు, ఎన్నికల తరువాత వైసీపీలో చేరిన వారికి మధ్య సైలెంట్ వార్ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు రావడంతో ఎవరికి వారు గ్రామాల్లో అధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ వివాదాలపై దృష్టి సారించకుండా ఎవరు గెలిచిన మన పార్టీయేగా అనుకుంటూ సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఆయా గ్రామాల్లో టీడీపీ నుండి పెద్దగా పోటీ ఉండకపోవడంతో ఆ పార్టీ నేతల మద్దతు తీసుకుని వైసీపీలోని ఒక వర్గం వారు బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వైసీపీ అసమ్మతి నేతలు టీడీపీలో చేరినట్లు ప్రకటించుకుని ఆ పార్టీ మద్దతుతో సర్పంచ్ పదవికి నామినేషన్ లు దాఖలు చేసిన సంఘటనలు ఉన్నాయి.
పదవుల కోసం ఎన్నికల సమయంలో పార్టీ మారిన నేతలు ఎన్నికలు అయిన వెంటనే మళ్లీ అధికార పార్టీ వైపు వెళ్లిపోవడమూ ఖాయమే. ప్రతిపక్ష పార్టీలో సర్పంచ్ పదవిలో కూర్చున్నా నామినేషన్ పద్దతిపై పనులు చేసే అవకాశం ఉండదు. ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కావు. అధికారులు సహకరించే పరిస్థితి ఉండదు. ఈ కారణంగా గ్రామాభివృద్ధి కోసం మళ్లీ అధికార పార్టీలోకి వెళ్లడం రివాజే. అవసరాల కోసం ఎమ్మెల్యే స్థాయి నేతలే పార్టీలు మారితే లేనిది గ్రామ స్థాయిలో పదవుల కోసం మనం పార్టీ మారితే తప్పేమిటి అని వారికి వారు సర్ది చెప్పుకుంటూ స్థానిక సమరంలో పోటీలకు దిగుతున్నారు.