TDP : తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో కిడ్నాప్ అయిన టీడీపీ అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. జగ్గంపేట మండలం గొల్లలగుంటలో టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా సబ్బెళ్ల పుష్పవతి నామినేషన్ వేశారు. అయితే ఆమె భర్త శ్రీనివాసరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు మత్తు మందు ఇచ్చి కాళ్లు, చేతులు కట్టేసి అడవిలో వదిలిపెట్టారు. తన భర్తపై దౌర్జన్యం చేసింది వైసీపీ కార్యకర్తలేనని పుష్పవతి ఆరోపిస్తున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ పంచాయతీలో పొన్నాడ వరలక్ష్మి అనే అభ్యర్థి సర్పంచ్గా పోటీ చేయడానికి నామినేషన్ వేయడానికి కార్యాలయానికి వెళ్లారు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఆమె భర్తకు ఫోన్ చేసి సమాచారం అందివ్వడంతో ఆయన వచ్చి భార్యను నామినేషన్ వెయ్యనీయకుండా తీసుకెళ్లిపోయారు. దీనికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విధంగా తొలి దశలో కాకినాడ, పెద్దాపురం డివిజన్లలో జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పోటీ చేయడానికి ముందుకు వస్తున్న అభ్యర్థులను నయానో, భయానో బెదిరించి పోటీ నుంచి తప్పుకునేలా అధికార పార్టీ వారు కర్రపెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పంచాయతీల పాలకవర్గాలన్నిటినీ సాధ్యమైనంత వరకు తమ గుప్పెట్లోకి తెచ్చుకోడానికి ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల అభ్యర్థులను నామినేషన్ వేయకుండా వైసీపీ నాయకులు ఎక్కడిక్కడ అడ్డుతగులున్నారు. తొలుత వీరిని ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి తాయిలాలు ప్రకటిస్తూ బుజ్జగింపు ధోరణిలో వెళ్తున్నారని తెలుస్తోంది. చివరి యత్నంగా మాట వినని వారిని బెదిరిస్తున్నారని గత మూడు రోజుల్లో బయటకు వచ్చిన సమాచారం బట్టి స్పష్టమవుతోంది. ఇదే సమయంలో ఎక్కడిక్కడ తమ మద్దతుదారుల అభ్యర్థుల ఏకగ్రీవ యత్నానికి వైసీపీ కుయుక్తులకు పాల్పడుతోంది. పెదపూడి మండలం జి.మామిడాడలో ఇటీవల ఒక ఎస్సీ మహిళపై నామినేషన్ వేయకుండా అధికార పార్టీ కీలక నేత ఒకరు ఒత్తిడి తెచ్చారు.
TDP : అప్రమత్తంగా ఉండండి -అండగా ఉంటా:చంద్రబాబు
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం నాడు మొదటి రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న జిల్లాల నేతలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు.వైసిపి అక్రమాలను ఎదురొడ్డాలని పిలుపు నిచ్చారు.పార్టీ నాయకత్వం కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ముఖ్యంగా ఏకగ్రీవాల విషయంలో పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలని స్క్రూటినీలో జాగ్రత్తలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.అధికార పార్టీ ఆశించినట్లుగా ఏకగ్రీవాలు జరగకపోవడాన్ని బట్టే పంచాయతీ ఎన్నికల తోనే వైసిపి పతనం ప్రారంభమైందనిచంద్రబాబు వ్యాఖ్యానించారు.