YS Jagan : సీఎం జగన్ పాలనలో ఫెయిల్ అవ్వలేదు. సంక్షేమంలో ఫెయిల్ అవ్వలేదు. ఆర్ధిక లోటు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని నడపడంలో ఫెయిల్ అవ్వలేదు. పార్టీ అధినేతగా పార్టీ / ప్రభుత్వం రెండింటినీ మేనేజ్ చేయడంలో ఫెయిల్ అవ్వలేదు..!! కానీ YS Jagan ఎక్కడ ఫెయిల్ అయ్యారు..? ఎందుకు ఫెయిల్ అయ్యారు..? అనేదే కదా సందేహం..! కాస్త సున్నితమైన అంశాలను, లోతుగా చర్చిస్తే Jagan ఫెయిల్యూర్ కనిపిస్తుంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి Justice NV Ramana పై ఫిర్యాదు.. పరిణామాలు గమనిస్తే ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఎన్నికల కమీషనర్ Nimmagadda Ramesh Kumar ని డీల్ చేసిన విధానం చూస్తే ఫెయిల్యూర్ కనిపిస్తుంది..! సింపుల్ గా ఫెయిల్యూర్ అని చెప్పుకున్నా తప్పే.., అందుకు కొన్ని కారణాలు, చేసిన తప్పులు చర్చించుకుంటేనే ఫెయిల్యూర్ నుండి పాఠం వస్తుంది..!!
YS Jagan : లేఖ తర్వాత ఏం జరిగింది..!?
సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీలో హైకోర్టు తీర్పులను ప్రభావితం చేస్తున్నారని.., ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కలిసి కుట్రలు పన్నుతున్నారని.., అమరావతి రాజధానిలో వాళ్ళ కుమార్తెల పేరిట భూములు కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారని.. గత ఏడాది అక్టోబర్ లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కి సీఎం జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖ అప్పట్లోనే జాతీయ స్థాయిలో సంచలనానికి తెరతీసింది. చర్చనీయాంశం అయింది. సుప్రీంలో అనేక పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగింది..? ఏ ఉద్దేశంతో జగన్ లేఖ రాసారో..? అది జరిగిందా..? లేదా అనేది అత్యంత కీలక అంశం. ఈ లేఖ రాయడంలో జగన్ వెనుక ఉన్న ఉద్దేశం నెరవేరకపోతే ఫెయిల్ అయినట్టే..! జస్టిస్ బాబ్దే ఈ లేఖని ఎంత మేరకు పరిగణనలోకి తీసుకున్నారు..? అనేది ముఖ్యమైన అంశం. ఇప్పటికే ఈ లేఖ రాసి నాలుగు నెలలు గడిచింది. ఈ లేఖపై విచారణ జరిగినా.. హౌస్ కమిటీ విచారణకు ఆదేశించినా ఇప్పటికే బయటకు వచ్చేది. కానీ అవేమి జరగలేదు. అంటే…!
YS Jagan : ఏప్రిల్ లోనే కీలక పరిణామాలు..!!
సీఎం జగన్ లేఖ రాసిన ఉద్దేశం. జస్టిస్ రమణపై విచారణ జరగాలి. ఆయన పదోన్నతి ఆగాలి. ఆయన సుప్రీమ్ చీఫ్ జస్టిస్ కాకూడదు అనేదే..! కానీ అది నెరవేరినట్టు లేదు. అంతా సవ్యంగానే సాగుతుంది. ఇంకో రెండు నెలలు ఇదే తీరుగా సవ్యంగా ఉంటే ఏప్రిల్ నెలలోనే కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ బాబ్ది ఏప్రిల్ 23 న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత సీనియారిటీ లిస్టులో జస్టిస్ ఎన్వీ రమణ ముందున్నారు. సో.., ఏప్రిల్ 24 నుండి రమణ సుప్రీమ్ చీఫ్ జస్టిస్ కానున్నారు. ప్రస్తుతానికి అయితే అందుకు ఎటువంటి అడ్డంకులు లేనట్టే. ఒకవేళ ఈ రెండు నెలల్లో ఏవైనా సంచలన పరిణామాలు జరిగి.., జగన్ లేఖపై లోతుగా వెళ్తే మాత్రం ఇది ఆగుతుంది. గడిచిన నాలుగు నెలల్లో జరగనిది.., ఈ రెండు నెలల్లో జరుగుతుంది అని ఆసించలేం..! అందుకే సుప్రీమ్ ని డీల్ చేసిన విషయంలో.., పిర్యాదు విషయంలో జగన్ ఫెయిల్ అయినట్టే. సో.. ముందస్తు హామీ లేకుండా.., ముందస్తు ప్రణాళిక లేకుండా పెద్ద వ్యవస్థతో ఢీ కొనడం, ఇలా ఫెయిల్ అవ్వడం అంటే జగన్ కి భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారేవిగా ఉంటాయి..! అందుకే జగన్ దీనిపై ఇప్పటి నుండి ఒక ప్రణాళిక వేసుకోవాల్సి ఉంది.
Nimmagadda ని డీల్ చేయడంలో మరో ఫెయిల్యూర్..!!
సుప్రీమ్.., జస్టిస్ ఎన్వీ రమణ అంశాలు పక్కన పెడితే… ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపడంలోనూ.., నిమ్మగడ్డని డీల్ చేయడంలోనూ జగన్ ఫెయిల్ అయ్యారు. లాజిక్ లేని వాదనలతో హైకోర్టు, సుప్రీమ్ కోర్టుల వరకు వెళ్లారు. అధికారులు, ఉద్యోగులు ముందుగా సహాయ నిరాకరణ చేసి.., మళ్ళీ కోర్టులు సీరియస్ గా చెప్పే వరకు తెచ్చుకున్నారు. ముందుగానే కోర్టు వరకు వెళ్లకుండా సైలెంట్ గా ఉంటూ.., బయటకు దొరకకుండా సహాయ నిరాకరణ వంటి మార్గాలు ఎంచుకుంటే… నిమ్మగడ్డ రమేష్ కుమారే కోర్టుకి వెళ్లేవారు. ఆయనే కొంత అసహనానికి గురయ్యేవారు. కానీ.. ప్రభుత్వమే హైకోర్టు, సుప్రీమ్ కోర్టు అంటూ ఒకదాని తర్వాత ఒక పిటిషన్ వేయడం.., విఫలమవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ముందస్తు ప్రణాళిక లేకుండా.. ఆవేశంగా నిర్ణయాలు తీసుకుని ఫెయిల్ అయ్యారు.
* ఇప్పటికీ మించిపోలేదు. జగన్ సీఎం అయ్యి ఇప్పటికి 20 నెలలు మాత్రమే అయింది. మరో 36 నెలలు ఆయన అదే స్థానంలో తిరుగులేని ప్రజాబలంతో కొనసాగనున్నారు. ఆయన పథకాలు, సంక్షేమ బాటతో విజయాలకు కొదవ ఉండకపోవచ్చు. కాకపోతే వ్యవస్థలతో ఢీ కొనడం.., ఢీ కొట్టే ముందు సరైన మార్గాలు ఎంచుకోవడం … కొన్ని ప్రణాళికలు వేసుకోవడమే జగన్ నేర్చుకోవాల్సిన పాఠాలు..!!