Chandra Babu : తిరుపతి విమానాశ్రయంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతిలో నేడు చంద్రబాబు చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్నందున చంద్రబాబు నిరసనకు అనుమతి నిరాకరించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నిరసనకు అనుమతి లేదంటూ టీడీపీ కార్యాలయానికి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నర్శింహయాదవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరో పక్క చంద్రబాబు ధర్నా నేపథ్యంలో జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. జిల్లా టిడీపీ కార్యాలయం, పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్యే దొరబాబు ఇంటి వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు ఆంక్షలు విదించినా ధర్నా నిర్వహించి తీరుతామని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు చర్యలు చేపట్టారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్యే దొరబాబు, చిత్తూరు టీడీపి పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నానితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అందరినీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు.
మరో పక్క తిరుపతి పర్యటనకు విచ్చేసిన చంద్రబాబును విమానాశ్రయంలోనే పోలీసు అధికారులు అడ్డుకున్నారు. తిరుపతిలో నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని ఆయనకు తెలియజేసి నోటీసు అందజేశారు. విమానాశ్రయంలోనే చంద్రబాబును నిలువరించారు. చంద్రబాబును వెనక్కు పంపించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. చంద్రబాబును విమానాశ్రయంలో టీడీపీ నేత చంద్రబాబును అడ్డుకోవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.