West Bengal Elections : పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ BJP, టీఎంసీ TMC ల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ Mamata Banerjee , మమతా బెనర్జీ పాలనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Narendra Modi, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా Amith shah తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శల జోరు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముస్లింలంతా టీఎంసీకే ఓట్లు వేయాలంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఈసీ నోటీసు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా మరో మారు ఈసీ.. మమతా బెనర్జీకి నోటీసు జారీ చేసింది.
పోలింగ్ బూత్ల వద్ద ఎన్నికల విధులు నిర్వహిస్తున్న కేంద్ర పారా మిలటరీ బలగాలపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ నెల 7వ తేదీన హుగ్లీ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ కేంద్ర పారా మిలటరీ బలగాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఆదేశాలతో కేంద్ర పారా మిలటరీ బలగాలు పని చేస్తున్నాయని విమర్శించారు. గ్రామస్తులపై మిలటరీ బలగాలు అరాచకాలకు పాల్పడుతున్నాయని కూడా ఆరోపించారు. మహిళలపై కూడా వేధింపులకు పాల్పడుతున్నారనీ, బీజేపీకీ ఓట్లు వేయాలంటూ వారు ఒత్తిడి చేస్తున్నారనీ దీదీ ఆరోపణలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. రెచ్చగొట్టే విధంగా అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని ఈసీ పేర్కొంది. కేంద్ర బలగాలను తిట్టడం, వారిని అవమానించడం మంచిది కాదనీ హితవు పలకుతూ ఈ వ్యాఖ్యల వల్ల బలగాల్లో మనోస్థైర్యం దెబ్బదింటుందని ఈసీ వ్యాఖ్యానించింది. ఈ నెల 10వ తేదీలోగా కేంద్ర పారా మిలటరీ బలగాలపై చేసిన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇవ్వాలని మమతా బెనర్జీకి నోటీసులో ఈసీ పేర్కొంది.