Minister Harish Rao: భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రి వర్గం నుండి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈటల ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసిఆర్, టీఆర్ఎస్ పార్టీ పై ఈటల తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శలు చేశారు. టిఆర్ఎస్ లోనూ అనేక మంది కేసిఆర్ పట్ల అసంతృప్తిగా ఉన్నారు అన్నట్లు చెప్పడానికి ఈటల ప్రయత్నిస్తూ మంత్రి హరీష్ రావు కూడా పార్టీలో అనేక అవమానాలకు గురి అయ్యాడంటూ ఈటల వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనం అయ్యింది. ఈటల వ్యాఖ్యలపై మంత్రి హరీష్ స్పందించారు. ఈటల వ్యాఖ్యలను ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
టీఆర్ఎస్ పార్టీల తాను నిబద్ధత, విధేయత, క్రమశిక్షణ కల్గిన కార్యకర్తనని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకూ పార్టీ ప్రయోజనాలే తనకు పరమావధి అన్నారు. పార్టీ నాయకత్వం ఏ బాధ్యత అప్పగించినా దాన్ని పూర్తి చేయడం తన విధి, బాధ్యత అని పేర్కొన్నారు. పార్టీ నాయకుడిగా కేసిఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం తన కర్తవ్యంగా భావిస్తానన్నారు. కేసిఆర్ పార్టీ అధ్యక్షుడే కాదు తనకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులని పేర్కొన్నారు.
కేసిఆర్ ఆజ్ఞలను జవదాటకుండా నడుచుకుంటున్నాననీ, గతంలో పలు మార్లు ఇదే విషయాన్ని అనేక వేదికలపై చెప్పానని గుర్తు చేశారు. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకూ ఇదే విధంగా నడుచుకుంటానన్నారు. పార్టీ వీడటానికి ఈటలకు అనేక కారణాలు ఉండవచ్చనీ, పార్టీలో ఉండాలా వెళ్లిపోవాలా అనేది ఆయన ఇష్టమన్నారు. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచినట్లుగా ఈటల వైఖరి ఉందని మండిపడ్డారు. ఈటల పార్టీ వీడినంత మాత్రాన టీఆర్ఎస్ కు వీస మెత్తు నష్టం కూడా లేదని హరీష్ రావు పేర్కొన్నారు.