YS Sharmila Party: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ గత ఏపి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కోసం పని చేసిన సంగతి తెలిసిందే. జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని త్వరలో ఆవిర్భావం చేస్తున్న నేపథ్యంలో షర్మిల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ టీమ్ సభ్యురాలు ప్రియను నియమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో రాజకీయ కార్యక్రమాలను నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల ఈ నెల 8వ తేదీన తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీ ప్రకటన చేయనున్నారు.
Read More: Uttarakhand Crisis: ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ రాజీనామా..! ఎందుకంటే..?
షర్మిల పార్టీ వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్న ప్రశాంత్ కిషోర్ (పీకే) టీమ్ సభ్యురాలు ప్రియ తమిళనాడు కు చెందిన డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె. పీకే టీమ్ లో సీనియర్ గా ఉన్న ప్రియ శుక్రవారం తన టీమ్ తో సహా లోటస్ పాండ్ లో షర్మిలను కలిసి వైఎస్ఆర్ టీపీ కోసం పని చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. పీకే వ్యూహ రచనతో ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ గతంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా 151 అసెంబ్లీ స్థానాలు కైవశం చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా ఇటీవల కాలం వరకూ తెలంగాణలో అధికార టీఎస్ఆర్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ ఎదుగుతుండగా వైఎస్ఆర్ టీపీ పేరతో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు, దానికి తోడు ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు చేబూనిన నేపథ్యంలో చతుర్ముఖ పోటీ అనివార్యమవుతోంది. తెలంగాణ లో రెడ్డి సామాజికవర్గంతో పాటు దివంగత నేత వైఎస్ఆర్ అభిమానులు గుండు గుత్తాగా వైఎస్ షర్మిల వైపు వెళతారు అనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడుగా నియమితులు కావడంతో సీన్ కొంత వరకు మారింది. వైఎస్ఆర్ కు వీరవిధేయులైన కొండా సురేఖ దంపతులు వైఎస్ షర్మిలకు జై కొట్టకుండా రేవంత్ రెడ్డికి మద్దతు పలికారు. ఈ పరిణామంతో వైఎస్ఆర్ అభిమానులు అంతా షర్మిల వెంట నడుస్తారు అని చెప్పలేని పరిస్థితి. తెలంగాణలో జరిగే చతుర్ముఖ పోటీలో పీకే శిష్యురాలు ప్రియ రాజకీయ వ్యూహాలు షర్మిల పార్టీకి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయా వేచి చూడాలి.