Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో కాకుండా కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల విధానంను హైకోర్టు రద్దు చేసింది. అయితే ఈ రెండింటి విషయాల్లో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది. వీటిపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు – నేడు, ఫౌండేషన్ స్కూళ్లపై సమక్ష జరిపారు. నూతన విద్యావిధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కనీసం మూడవ తరగతి నుండి సబ్జెక్ట్ ల వారీగా ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని రకాల పాఠశాలలు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలనీ, ఐసీఎస్ఈ అఫిలియేషన్ మీద కూడా దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. వచ్చే ఏడాది స్కూళ్లకు వెళ్లే నాటికి విద్యాకానుక అందించాలనీ, విద్యాకానుక కింద ఇచ్చే వస్తువులు నాణ్యతగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇదే సందర్భంలో జగనన్న విద్యాదీవెన, ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల విధానంపై హైకోర్టు తీర్పుపై సమీక్ష జరిపారు. అనంతరం ప్రభుత్వ నిర్ణయాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
జగనన్న విద్యాదీవెన విషయంలో హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని సమావేశంలో సీఎం నిర్ణయించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, పారదర్శకత కోసమే సీఎం జగన్ ఆదేశాల మేరకు తల్లుల ఖాతాలో నగదును జమ చేసే విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయడం వల్ల కలిగే లబ్ది తెలియజేస్తూ జగనన్న విద్యాదీవెన ను యథాతధంగా అమలు చేయాలని రివ్యూ పిటిషన్ లో కోర్టును కోరతామన్నారు. ఇక హైకోర్టు ఆదేశాల మేరకే ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లు చేస్తున్నామనీ, దీన్ని నిలుపుదల చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలు తమకు ఇంకా అందలేదన్నారు. ఆన్ లైన్ అడ్మిషన్ల విధానం అమలు వెనుక ఉద్దేశం, ప్రయోజనాలను వివరిస్తూ ఈ విధానాన్ని అమలుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టును కోరతామని చెప్పారు మంత్రి సురేష్.