కందుకూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ విధంగా భరోసా ఇచ్చాడో జగన్ కూడా అదే విధంగా భరోసా ఇస్తాడనీ, మీ అందరికీ నేను మాట ఇస్తున్నాననీ వైఎస్ విజయమ్మ అన్నారు. విజయమ్మ నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి విజయమ్మ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
రాజశేఖరరెడ్డి పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానని విజయమ్మ అన్నారు. రాజశేఖరరెడ్డి పాలనను చూసి ఈ రోజు ఉన్న పాలను చూస్తే చాలా బాధగా ఉందని విజయమ్మ పేర్కొన్నారు.
జగన్కు ఒక్కసారి అవకాశం ఇవ్వండని విజయమ్మ ప్రజలను కోరారు. విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని ప్రజలను కోరుతున్నామని విజయమ్మ పేర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాలు నా బిడ్డ మీతో ఉన్నాడు మాతో కూడా లేడు అని విజయమ్మ తెలిపారు.
జగన్ చేసిన పాదయాత్రలో గానీ ఓదార్పు యాత్రలో గానీ తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని విన్నాడు చూశాడు ఈ రోజు భరోసా ఇస్తున్నాడని విజయమ్మ చెప్పారు.
చంద్రబాబు జగన్- జగన్ – జగన్ అని జపం చేస్తున్నాడు కాబట్టి ఆ జగన్ను గెలిపించాలని కోరుతున్నామని విజయమ్మ పేర్కొన్నారు. ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో జగన్ పక్షాన నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం కనిగిరి, మార్కాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
తొలుత విజయమ్మ ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి సమాధి వద్ద క్రైస్తవ పద్దతిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.