Guntur YSRCP: ఏపిలో రాబోయే ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు అంతర్గతంగా సిద్ధం అవుతున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని బయట అనుకుంటున్నా ఎన్నికలు అనేవి పరీక్షలకే పరీక్షలు లాంటివి. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం విద్యార్ధులు ఏడాది మొత్తం సానబట్టినట్లే ఇవి పరీక్షలకే పరీక్షలు కాబట్టి రెండున్నర సంవత్సరాల తరువాత ఎన్నికలు ఉన్నప్పటికీ ఇప్పటి నుండి రాజకీయ పార్టీలు తమ స్ట్రాటజీలు, కసరత్తులు, అభ్యర్ధుల ఎంపికలు మొదలు పెడతాయి. దీనికి సంబందించి ప్రతి నియోజకవర్గాల వారీగా కూడా పార్టీల అంచనాలు మారుతుంటాయి. ముఖ్యంగా ఇటు వైసీపీ ప్రత్యేకమైన స్ట్రాటజీలు అమలు చేయడానికి సిద్ధం అవుతోంది. ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు ఉంటుంది అని వైసీపీ నమ్ముతోంది. ఒక వేళ ఆ రెండు పార్టీలు పొత్తు ఉంటే చాలా చోట్ల అభ్యర్ధులను మార్చాల్సి ఉంటుంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధుల ఎంపిక జరపాల్సి ఉంటుంది. అందుకే ముఖ్యంగా ఈ రెండు పార్టీల పొత్తు ఉంటే ఒకలా, పొత్తు లేకుంటే మరో విధంగా అభ్యర్ధుల ఎంపిక చేయడానికి ప్రతి చోట ప్రత్యామ్నాయం రెడీ చేసుకుంటోంది వైసీపీ. కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేయడానికి రెడీ అవుతోంది..!
Guntur YSRCP: రాజధాని జిల్లాల్లో కీలకం..!
ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించిన విషయానికి వస్తే .. ప్రత్యర్థుల పొత్తులను దృష్టిలో పెట్టుకుని అయిదు స్థానాలు మార్చబోతున్నారు అని తెలుస్తోంది. కొంత మందిని అటు ఇటు మార్చడం గానీ, కొంత మందికి టికెట్లు ఇవ్వకుండా ఉండటం గానీ చేయనున్నారనేది సమాచారం. మాచర్ల, బాపట్ల, వేమూరు, మంగళగరి, నర్సరావుపేట, పత్తిపాడు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ అభ్యర్ధుల విషయంలో ఎటువంటి ఢోకా లేదని సమాచారం. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన అక్కడ స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నారు. ఆయన్ను మార్చే అవకాశం లేదు. బాపట్ల లో కోనా రఘుపతి, ఆయన్ను మార్చే అవకాశం లేదు. వేమూరు లో మేరుగు నాగార్జన ను మార్చరు, మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణరెడ్డి విషయానికి వస్తే కొంత అనుమానం ఉన్నప్పటికీ ఆయనే పోటీ చేస్తామంటున్నారు, కానీ పార్టీ మార్చే ఆలోచనల్లో ఉంది. ఇక నర్సరావుపేటలో గోపిరెడ్డిని కూడా మార్చే అవకాశం లేదు. అక్కడ ఏమైనా సమీకరణాలు మారితే అప్పులు ఆలోచన చేసే అవకాశం ఉంది. అలానే పత్తిపాడు లో మేకతోటి సుచరిత సీనియర్ ఎమ్మెల్యే, మంత్రి ఆమెను మార్చే అవకాశం లేదు. గుంటూరు ఈస్ట్ లో ముస్తఫాను మార్చరు.
అంబటి సహా… కొందరికి డౌటు..!
ఇక మార్చే నియోజకవర్గాలను చూసుకుంటే.. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఇక్కడ సామాజిక సమీకరణాలు కీలకం. సత్తెనపల్లిలో కమ్మ సామాజికవర్గంతో పాటు రెడ్డి, కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువే. టీడీపీ, జనసేన పొత్తు ఉంటే ఈ నియోజకవర్గంలో అభ్యర్ధిని మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది అని వైసీపీ భావిస్తోంది. అప్పుడు అంబటి రాంబాబును వేరే నియోజకవర్గానికి మార్చే అవకాశం ఉంటుంది. తరువాత తాడికొండ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి డొక్కా మాణిక్య వరప్రసాద్ కుమార్తెను పోటీకి దింపాలని ఆయన భావిస్తున్నారు. ఆ హామీతోనే ఆయన వైసీపీలో చేరారు. డోక్కా కుటుంబం ఒక పక్క ప్రయత్నిస్తుండగా, మరో పక్క బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కూడా ఈ సీటు నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ మరో ఇద్దరు పోటీలో ఉండటంతో మార్చే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. మరో వైపు పొన్నూరు నియోజకవర్గంలో కూడా రెండు పార్టీల పొత్తు నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఉన్న కిలారు రోశయ్యను మార్చి వేరే చూటకు పంపితే బాగుంటుంది అని పార్టీ ఆలోచన చేస్తుందట. మరో వైపు గుంటూరు వెస్ట్ మద్దాలి గిరి. ఈయన టీడీపీ నుండి గెలిచి వైసీపీలోకి వెళ్లారు. ఈయనకు కూడా వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చే అవకాశం లేదు. అక్కడ మొదటి నుండి గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధి మొదుగుల వేణుగోపాల్ రెడ్డి తో పాటు ముగ్గురు నలుగురు నేతలు పోటీలో ఉన్నారు. వాళ్లు ఈ సీటు కోసం ఎదురుచూస్తున్నారు. లేళ్ల అప్పిరెడ్డి కూడా ఈ సీటు ఆశిస్తున్నారు. తరువాత వినుకొండ నియోజకవర్గంలో బొళ్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ కూడా జనసేన, టీడీపీ పొత్తు ఉంటే ఈ సీటు కూడా మార్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నియోజకవర్గంలో జడ్పీటీసీ స్థానాన్ని కూడా కోల్పోయారు. ఈ కారణంగా ఇక్కడి ఎమ్మెల్యేని మారిస్తే బాగుంటుంది అని పార్టీ అనుకుంటోందని సమాచారం. ఇలా గుంటూరు జిల్లాలో ఈ అయిదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను సామాజిక సమీకరణాల నేపథ్యంలో మార్చవచ్చు అని పార్టీ అంతర్గత టాక్ వినిపిస్తుంది..!