AP Politics: ఎమ్మెల్యే అంటే కొన్ని మానవ సంబంధాలు.. కొంతమంది అనుచరులు.. ఒక ప్రాంత సెంటిమెంట్.. అన్నిటికీ మించి పార్టీ, రాజకీయం, ఓటింగ్ పట్ల నిబద్ధత, నిజాయతీ ఎంతో కొంత ఉండాలి..! ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు తరచూ పార్టీలు మార్చడం సహజమే.. లేదా తరచూ నియోజకవర్గాలు మార్చడం సహజమే.. కానీ ఒక్క ఎమ్మెల్యే మాత్రం తరచూ నియోజకవర్గాలు, పార్టీలు, అనుచరులు అన్నిటినీ మార్చేస్తూ మానవ రాజకీయ సంబంధాలు లేకుండా రాజకీయం చేస్తున్నారు..! ఆయనెవరో, ఆయన ప్రత్యేకతలేమిటో.., ప్రస్తుతం ఆయన చేస్తున్న బేరం ఏమిటో ఓ సారి చూద్దాం..!
గంటా శ్రీనివాసరావు. మొదట చోడవరం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అనకాపల్లి ఎంపీగా గెలిచారు. భీమిలి నుండి గెలిచారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి గెలిచారు. నాలుగు ఎన్నికలు, నియోజకవర్గాలు మారారు, గెలుస్తూ వస్తున్నారు. అటువంటి ప్రత్యేకతలు ఆయనకు ఉన్నాయి. ఇవే కాదు, ఇంకొన్ని బయటకు తెలియని ప్రత్యేకతలున్నాయి. అంతకు మించి తాజా సామజిక బేరాలున్నాయి. నిజానికి కొంత మంది నాయకులు గెలిచినా ఓడినా ఒకే నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉంటారు. ఆ నియోజకవర్గంలో తనకంటూ ఒక అనుచర బృందాన్ని ఏర్పాటు చేసుకుంటారు. తనను నమ్మి ప్రాణం ఇచ్చే కార్యకర్తలను ఏర్పాటు చేసుకుంటారు. తను ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటారు. గంటా శ్రీనివాసరావుకు నియోజకవర్గాలతో సంబంధం లేదు. తను గెలవడం కావాలి. పదవి కావాలి. ఓట్లు వేసేవాళ్లు కావాలి, తనను గెలిపించే వాళ్లు కావాలి. ఏ నియోజకవర్గానికి వెళితే ఆ నియోజకవర్గంలో అనుచరులను ఏర్పాటు చేసుకోగలరు. ఇదే సామాన్య రాజకీయ నాయకుడికి, అసామాన్య రాజకీయ నాయకుడికి మధ్య ఉన్న తేడా. ఇవి ఆయన ప్రత్యేకతలుగా భావించాల్సి ఉంటుంది. నియోజకవర్గాలు మారుతూ గెలవడం కూడా ఒక ప్రత్యేకతే. ఆయన వ్యూహాలు, ఎలా ఖర్చు పెడతారు..? ఎంత ఖర్చు పెడతారు..? అనేది అందరికీ తెలిసిందే. ఎక్కడ నుండి అయినా ఆయన గెలవడం ముఖ్యం. గెలిచి చూపిస్తారు. ఆయన మైండ్ అంత షార్ప్. ఆయన పొలిటికల్ ఐడియాలజీ అంత షార్ప్..!
AP Politics: వైసీపీలోకి వెళ్లాలనుకునే బోర్లా.. కానీ..!?
విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా ఆయన స్వల్ప మెజార్టీతో మొన్న ఎన్నికల్లో గెలిచారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయనకు అది నచ్చదు. అధికార పార్టీలో ఉంటే ఆ దర్పం వేరు. ఆ హోదా వేరుగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉండాల్సి రావడంతో సైలెంట్ ఐపోయారు. వైసీపీలో వెళ్లాలని చూసినప్పటికీ అధికార పార్టీ గేట్లు తెరుచుకోలేదు. వాళ్లు పెట్టిన కండిషన్ లకు ఈయన ఒప్పుకోలేదో..? ఈయన పెట్టిన కండిషన్లకు వాళ్లు ఒప్పుకోలేదో..? అక్కడ
కుదరలేదు. బీజేపీలో వెళ్లాలని ప్రయత్నం చేసి అంతా ఓకే అనుకున్నప్పటికీ కేంద్ర బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మోసం చేసింది. విశాఖ ప్రాంతంలో బీజేపీ చాలా దారుణమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. తను ఎంత నియోజకవర్గాలు మారినా విశాఖ జిల్లా మొత్తాన్ని వదిలివేసి ఏదో పశ్చిమ గోదావరికో,. లేక ప్రకాశం, నెల్లూరు, రాయలసీమకు వెళ్లలేరు కదా..! ఎంత మారిన ఆ జిల్లాలోనే చుట్టు పక్కల నియోజకవర్గాలు మారాల్సి ఉంటుంది. బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ఆయన బీజేపీలోకి వెళ్లలేకపోయారు. వైసీపీలోకి వెళ్లలేకపోయారు.
అన్ని పార్టీలకు చెడి.. ఇప్పుడు..!?
టీడీపీ వాళ్లేమో ఆయనను నమ్మడం లేదు. 2014 ఎన్నికల ముందు వచ్చినా మంత్రి పదవి ఇచ్చి ప్రాధాన్యత ఇస్తే పార్టీ ప్రతిపక్షంలో ఉంటే పార్టీ మారడానికి చూశాడు. సో.. ఈయనను పట్టించుకోవాల్సిన పని లేదు అని టీడీపీ కాస్త ఆయనను దూరం పెట్టడం ప్రారంభించింది. టీడీపీ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించింది. ఇప్పుడు ఆయన ఏ పార్టీకి చెందని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి అయితే టీడీపీలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. రాజీనామా చేసినా ఆ రాజీనామా ఆమోదం పొందలేదు. ఇప్పుడు
ఆయన ఏమి చేస్తున్నారంటే.. తన గుర్తింపు. తన ప్రత్యేకత కొరకు తన సామాజిక నేతలను కూడగడుతున్నారు. ఆ క్రమంలోనే ఇటీవల రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ లో తన సామాజిక వర్గ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. అంతకు ముందు వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాబోయే ఎన్నికల్లో రాజకీయాలను శాసించేది కాపు సామాజికవర్గమేనంటూ పేర్కొన్నారు. “తాజాగా ఏం చేస్తున్నారంటే…? తన సామజిక వర్గ అంతగా పొలిటికల్ లైన్ లో లేని, సొంత ఐడియాలజీ లేని నేతలతో తరచూ చర్చలు, సంప్రదింపులు జరుపుతూ మొత్తం సామాజికవర్గం తన వెంటే ఉన్నట్టు.. తాను చెప్పినట్టే తన సామాజికవర్గం మొత్తం వింటుంది అన్నట్టు ఇటు టీడీపీ, అటు వైసీపీలకు సంకేతాలు పంపిస్తున్నారు.. ఈ భేటీలకు కీలకమైన కాపు నేతలు ఎవ్వరూ వెళ్ళకపోవడం.., అటు గంటా వ్యవహారం మొత్తం బాగా తెలిసిన పార్టీలు ఈ చర్చలు, భేటీలను లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం..!