తమిళనాట అన్నా డీఎంకే వర్గ పోరులో ఒ పన్నీరు సెల్వం (ఒపీఎస్) పై మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి (ఈపీఎస్) ఆధిపత్యం సాధించారు. అన్నా డీఎంకే తాత్కాలిక కార్యదర్శిగా పళని స్వామి ఎన్నికయ్యారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత మరణానంతరం పార్టీ లో ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేశారు. నాటి నుండి పన్నీరు సెల్వం సమన్వయకర్తగా, పళని స్వామి సంయుక్త సమన్వయ కర్తగా కొనసాగుతున్నారు. అయితే ధ్వంద నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోవడం సమస్యాత్మకంగా మారిందనీ, పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయంపై జిల్లా కార్యదర్శులతో సమావేశం నిర్వహించి చర్చించారు.
ఆ సమావేశంలో పళని స్వామి మద్దతుదారులు ఏకనాయకత్వ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దీన్ని పన్నీరు సెల్వం వర్గీయులు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే కోర్టు కేసులు, తదితర నాటకీయ పరిణామాల అనంతరం గత నెల 23న సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఏక నాయకత్వ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో తదుపరి సమావేశాన్ని జూలై 11 వ తేదికి వాయిదా పడింది. అయితే ఈ సమావేశం జరగకుండా నిషేదించాలని పన్నీర్ సెల్వం వర్గం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం .. నేడు ఓపిఎస్ వర్గం పిటిషన్ ను తిరస్కరిస్తూ పళని స్వామి నేతృత్వంలో సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు అనుమతినిచ్చింది.
కోర్టు తీర్పు వచ్చిన కొద్ది సేపటికే పళని స్వామి నేతృత్వంలో అన్నా డీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మొత్తం 16 తీర్మానాలకు ఆమోదం పొందగా, అన్నా డీఎంకే లో ద్వంద నాయకత్వాన్ని (కోఆర్డినేటర్ పదవులు) రద్దు చేశారు. పళని స్వామి ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు తీసుకునేలా ఆమోదం తెలిపింది. పార్టీ తాత్కాలిక కార్యదర్శిగా పళని స్వామి ఎన్నిక కాగా, త్వరలోనే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.
మరో పక్క సర్వసభ్య సమావేశాన్ని వ్యతిరేకిస్తూ ఓపీఎస్ మద్దతుదారులు అన్నా డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అంతకు ముందు ఈపీఎస్, ఒపిఎస్ మద్దతుదారుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది, పలువురు గాయపడ్డారు. ఈ ఆందోళన నేపథ్యంలో పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. పార్టీ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ సర్వసభ్య సమావేశం నేతృత్వంలో ఈపీఎస్ వర్గం హైటెక్ ఏర్పాట్లు చేసింది. మెట్రో రైల్వే స్టేషన్ తరహాలో క్యూ ఆర్ కోడ్, ఎంట్రీ ఐడీ కార్డు, సెక్యూరిటీ లాగిన్ వంటి జాగ్రత్తలు తీసుకోగా, తమకు ఐడీ కార్డులు అందలేదని ఒపిఎస్ వర్గీయులు ఆరోపించారు.