విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా షార్జాకు విమాన సర్వీస్ ప్రారంభమైంది. ఈ సర్వీసును సోమవారం గన్నవరం ఎయిర్ పోర్టులో వైసీపీ ఎంపీ, ఎయిర్ పోర్టు అడ్వైైజరీ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి.. టీడీపీ ఎంపీ కేశినేని నానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎంపీలు షార్జా విమానం ఎక్కిన ప్రయాణీకులకు బోర్డింగ్ పాసులు అందజేశారు. విజయవాడ నుండి షార్జాకు విమాన సర్వీసులు నడపనున్నట్లు ఎయిరిండియా ఇటీవలే ప్రకటించింది.
వారంలో రెండు రోజులు నేరుగా గన్నవరం విమానాశ్రయం నుండి షార్జాకు విమాన సర్వీసులు నడవనున్నాయని ఎయిర్ పోర్టు డైరక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు షార్జా నుండి వచ్చే విమానం గన్నవరం చేరుకుంటుంది. సోమవారం 55 మంది ప్రయాణీకులతో షార్జా నుండి మొదటి సారిగా వచ్చిన విమానానికి గన్నవరం ఎయిర్ పోర్టులో ఎంపీ బాలసౌరి అధికారులతో కలిసి స్వాగతం పలికారు. గన్నవరం చేరుకున్న ఈ విమానం తొలి రోజు 125 మంది ప్రయాణీకులతో తిరిగి షార్జా తిరుగు ప్రయాణమైంది.
ఇంతకు ముందు ఏపీ వాసులు షార్జా వెళ్లాలంటే విజయవాడ నుండి నేరుగా విమాన సర్వీసు అందుబాటులో లేకపోవడంతో శంషాబాద్ (హైదరాబాద్) నుండి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం గన్నవరం నుండి విమాన సర్వీసు అందుబాటులోకి రావడంతో కేవలం నాలుగు గంటల్లో షార్జా చేరుకునే అవకాశం ఏర్పడింది.