చైనా, అమెరికా సహా పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ (బీఎఫ్ 7 సబ్ వేరియంట్) విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం వివిధ రాష్ట్రాలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపి సర్కార్ తీసుకుంటున్న చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కరోనా వ్యాప్తి, కొత్త వేరియంట్ల విషయంలో ఏపి సర్కార్ అప్రమత్తంగా ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె నివాస్ తెలిపారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
డిసెంబర్ నెలలో దాదాపు 30వేల కోవిడ్ పరీక్షలు చేయగా, 130 మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయని కమిషనర్ జె నివాస్ చెప్పారు ఈ 130 పాజిటివ్ కేసులు కూడా ఓమిక్రాన్ వేరియంట్లేనని ఆయన తెలిపారు. ఇతర వేరియంట్లు నమోదు కాలేదని చెప్పారు. కొత్త వేరియంట్లు వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో అందుకు తగిన ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు నివాస్. రాష్ట్రంలో జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఏపి వ్యాపితంగా 29 పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
చైనా నుండి వచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 కేసులు భారత్ లోనూ వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్రం కేంద్రం అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. ఆరు నెలల కాలంలో బీఎఫ్ 7 సబ్ వేరియంట్ కేసులు దేశంలో నాలుగు నమోదు అయ్యాయి. గుజరాత్ మూడు, ఒడిశాలో ఒక ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 కేసులు నమోదు అయ్యాయి. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె నివాస్ స్పందించారు. ఏపిలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరిపడా అందుబాటులో ఉన్నాయనీ, బెడ్లు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.