మెడికో ప్రీతి ఘటన మరువకముందే ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధిని బలైంది. తోటి విద్యార్ధి వేధింపులు తాళలేకే మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్లు నగరంలో జరిగింది. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కుమార్తె రక్షిత (20) నర్సంపేట లోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ థర్డ్ ఇయర్ చదువుతోంది. అయితే రక్షితకు చెందిన ఫోటోలను ఓ విద్యార్ధి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె వరంగల్లులోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎండీఎం మార్చురీకి తరలించారు. మెడికో ప్రీతి మాదిరిగానే తమ కుమార్తె కూడా సీనియర్ల వేధింపులకు బలి అయ్యిందని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు సిద్దమవుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాల విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో వారం రోజుల వ్యవధిలో మూడు ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. మెడికో ప్రీతి ఘటన తర్వాత నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్ధి హర్ష హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హర్ష మృతిపై అతని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయిదు రోజులుగా మృత్యువుతో పోరాడిన మెడికో ప్రీతి ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ర్యాగింగ్ విష సంస్కృతికి నిరసనగా నేడు (సోమవారం) వైద్య కళాశాలల బంద్ కు ఏబీవీపీ తెలంగాణ శాఖ పిలుపునిచ్చింది. ప్రీతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్ సాధారమని ప్రకటించిన అధికారులను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ప్రవీణ్ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.