సీనియర్ ర్యాగింగ్, వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్లు కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్ధిని ప్రీతి కన్నుమూసినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. అయిదు రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందింది. వైద్య విద్యార్ధి ప్రీతిని కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించామనీ, కానీ కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. అంతకు ముందు ప్రీతికి బ్రెయిన్ డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు.
ప్రీతి ఈ నెల 21న పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నంకు యత్నించింది. అయితే మల్టి ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కాగా మొదటి రోజు నుంచే ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతూ వచ్చారు. అమెను బ్రతికించేందుకు వైద్య బృందం అన్ని విధాలుగా కృషి చేసింది. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఏరోజుకారోజు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వచ్చారు. మొదట ఎంజీఎంలో వైద్యం అందించగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఆ రోజు నుండి ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు వెల్లడిస్తూ వచ్చారు. కాగా ఈ కేసులో సీనియర్ మెడికో సైఫ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
కాగా చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రీతి కుటుంబానికి కెసిఆర్ సర్కార్ పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. బాదిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధులుగా ఆదుకుంటుందని సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు ఈ ప్రకటన చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకరరావు తెలిపారు. ప్రీతి మృతి పట్ల సీఎం కేసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టకరమనీ, ఎవరూ పూడ్చలేని దుఖఃలో ఆ కుటుంబం ఉందని మంత్రి దయాకరరావు అనారు. ప్రీతి ఘటనపై విచారణ కొనసాగుతోందనీ, ఇప్పటికే నిందితుడుని పోలీసులు అరెస్టు చేయడం జరిగిందనీ, విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు.