ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ జరగనుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో 60 శాసనసభ స్థానాల చొప్పున ఉన్నాయి. కాగా మేఘాలయలో ఓ అభ్యర్ధి మరణించగా, నాగాలాండ్ లో ఓ నియోజకవర్గం ఏకగ్రీవం అయ్యింది. దీంతో రెండు రాష్ట్రాల్లో 59 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 2న జరగనుంది.
కాగా రెండు రాష్ట్రాల్లో 552 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 34 లక్షలకుపైగా ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. మేఘాలయలో 369 మంది, నాగాలాండ్ లో 183 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మేఘాలయలో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ), ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ కనబడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ 21 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ) 20 సీట్లలో విజయం సాధించింది. ప్రాంతీయ పార్టీలు, బీజేపీ మద్దతుతో ఎన్పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి ఎన్ పీపీ, బీజేపీ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి.
మరో వైపు నాగాలాండ్ లో అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ), బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, జేడీయూల నుండి వాటికి గట్టి పోటీ ఎదురవుతోంది. 2018 ఎన్నికల్లో ఎన్ఫీఎఫ్ 26, బీజేపీ 12, ఎన్ డీ పీపీ 18 స్థానాల్లో విజయం సాధించగా, ఎన్ డీ పీపీ – బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధిని బలి.. ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్య