Big Breaking స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్డు 14 రోజులు రిమాండ్ విధించింది. ద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో నిన్న ఉదయం నంద్యాలలో అరెస్టు చేయడం తీవ్ర సంచలనం అయ్యింది. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును నిన్న ఉదయం సీఐడీ అధికారులు అరెస్టు చేసి రోడ్డు మార్గం గుండా విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. రాత్రి సుదీర్ఘంగా చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ నకు సంబంధించి దాదాపు 20 ప్రశ్నలను సీఐడీ అధికారులు చంద్రబాబు ముందు ఉంచగా వాటికి వాటికి సమాధానాలు చెప్పకుండా తనకు ఈ కేసులో సంబంధం లేదని చెప్పడంతో పాటు తనకు తెలియదు, గుర్తు లేదని సమాధానాలు చెప్పిట్లుగా తెలిసింది.
రాత్రి అంతా సీట్ కార్యాలయంలోనే చంద్రబాబును ఉంచి విచారణ జరిపిన సీఐడీ అధికారులు ఆదివారం వేకువ జామున వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టు లో న్యాయమూర్తి సమక్షంలో రిమాండ్ రిపోర్టుతో హజరుపర్చారు. ఏసీబీ కోర్టులో ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి. సీబీఐ రిమాండ్ రిపోర్టులో రూ.371 కోట్ల స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ లో రూ,279 కోట్లు షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లాయనీ, ఈ నిధులు చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేశ్ ద్వారా కొంత మొత్తం నారా లోకేశ్ కు ముట్టాయని అభియోగించింది. ఈ కేసులో ఎవరి పాత్ర ఏమిటి అనే విషయాలను వెల్లడిస్తూ తాజాగా అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు, లోకేష్ పేర్లను కూడా రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొంది.
ఈ సందర్భంలో చంద్రబాబు తన వాదన వినిపించారు. చంద్రబాబు స్టేట్ మెంట్ ను న్యాయమూర్తి రికార్డు చేశారు. స్కీల్ డవలప్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలన్నది కేబినెట్ తీసుకున్న నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని, స్కిల్ డవలప్ మెంట్ కు 2015-16 బడ్జెట్ లో పొందుపర్చామని తెలిపారు, దీనికి రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించిందన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరన్నారు. 2021 డిసెంబర్ 9న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కానీ, రిమాండ్ రిపోర్టులో కూడా తన పాత్ర ఉందని ఎక్కడా సీఐడీ పేర్కొనలేదని చంద్రబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్ద్ లూద్రా వాదనలు వినిపించారు. స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ రాజకీయ ప్రేరేపితమనీ, 2021 లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తి కాగా తీర్పు కూడా రిజర్వులో ఉందన్నారు. ఈ కేసు ఎప్పుడో ముగిసింది, నిందితులందరికీ బెయిల్ వచ్చింది. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్ చేసారు. చంద్రబాబు పై చేసినవి అధారాల్లేని ఆరోపణలు. ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసింది. సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదు, ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదు, కాబట్టి సీఐడీ ఎలా అరెస్టు చేస్తుంది. చంద్రబాబును నంద్యాలలో మెజిస్ట్రేట్ ముందు హజరుపర్చే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం వాళ్లు అనుకున్న చోటే ప్రవేశపెట్టింది, సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులను అందించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలి. అరెస్టు చేసిన పోలీసుల 48 గంటల కాల్ డేటా కోర్టుకు సమర్పించాలి. అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీఐడీ నడుచుకోలేదు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం.. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలి అంటూ పంజాబ్ మణిందర్ సింగ్ కేసును ప్రస్తావించారు లూధ్రా.
ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర కీలకమని, చంద్రబాబు బలవంతం మీదనే నిధులు విడుదల జరిగిందనీ మద్య వర్తిగా కిలారు రాజేశ్ వ్యవహరించారనీ ఆయన ద్వారానే ఇదంతా జరిగిందని సీఐడీ తరపున అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. 2021 లో కేసు నమోదు అయితే ఇంత వరకూ చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదని ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు. గతంలో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు ఎందుకు లేదు.. బాబు పేరును ఇప్పుడెలా చేర్చారు.. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యంపై కారణాలు ఏమిటి.. చంద్రబాబు పాత్ర ఉందని నిరూపించే అధారాలు ఉన్నాయా అంటూ న్యాయమూర్తి ప్రశ్నలు సంధించారు. రిమాండ్ రిపోర్టులో 19వ పేజీలో పేరా 8లో ఏ 37, ఏ 38 పాత్రలను వివరించామని సీఐడీ న్యాయవాది వివరించారు.
ఇలా వేడివేడిగా వాదనలు మధ్యాహ్నం వరకూ సాగాయి.ఇరువర్గాల వాదనలు ముగించిన న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. సాయంత్రం 6,50 ప్రాంతంలో తీర్పు వెల్లడించారు. కోర్టు తీర్పు రాకముందే కోర్టు పరిసర ప్రాంతంలో టీడీపీ శ్రేణులను అరెస్టు చేయడంతో పాటు భారీ పోలీసు బలగాలను మొహరించడంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాసాగింది. సీఐడీ వాదనలు ఏకీభవించిన న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత తీర్పు అనుకూలంగా వస్తుందని భావించిన టీడీపీ శ్రేణులు ఒక్క సారిగా ఖంగుతిన్నారు.