AP High Court: రుషికొండపై జరుగుతున్న నిర్మాణాల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రుషికొండపై అనుమతికి మించి నిర్మాణాలు ఉన్నాయని హైకోర్టు నియమించిన కమిటీ నివేదించింది. అనుమతికి మించి కట్టడాలు ఉన్నాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. నివేదికపై మరో సారి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.
రుషికొండపై నిర్మించిన కట్టడాలను మరో సారి పరిశీలించి చర్యలు తీసుకోవాలని, దీనిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని అటవీ పర్యావరణ శాఖను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 29వ తేదీకి వాయిదా వేసింది. రుషికొండ పై ముఖ్యమంత్రి కార్యాలయం కోసం నిర్మాణాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది పర్యావరణానికి ప్రమాదమని కొందరు హైకోర్టును ఆశ్రయించగా, దీనిపై గతంలో హైకోర్టు కమిటీని నియమించింది.
రుషికొండపై పర్యాటక శాఖ నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలు అని చెబుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో విశాఖ నుండి పరిపాలన సాగిస్తానని చెప్పడంతో అవి ముఖ్యమంత్రి నివాసానికి జరుగుతున్న నిర్మాణాలు అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం అంటూ ఇటీవల ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి జీవోలను విడుదల చేసింది. ఈ తరుణంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శికి విచారణ చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశించడం హాట్ టాపిక్ అయ్యింది.