YS Sharmila: ఒక నాడు జగనన్న వదిలిన బాణం (వైఎస్ షర్మిల) ఇప్పుడు సోనియమ్మ అమ్ములపొదిలో చేరింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసిన జగన్ పార్టీ వైఎస్ఆర్ సీపీని దెబ్బతీయడానికి అదే జగనన్న వదిలిన బాణాన్ని ప్రయోగించడానికి కాంగ్రెస్ సిద్దమవుతోంది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లో యాక్టివ్ అయితే పార్టీ ఓటు బ్యాంక్ పెరుగుతుందని భావిస్తొంది.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోగా, ఇప్పుడు ఆయన తనయ వైఎస్ షర్మిల ద్వారా భర్తీ చేసుకోవాలని భావిస్తొంది. షర్మిల రాకతో వైసీపీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు చాలా మంది షర్మిల వెంట నడిచే అవకాశం ఉందని అనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ పెద్దగా పుంజుకోకపోయినా 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు.
ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి .. షర్మిల వెంట నడుస్తానని, కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పారు. అలానే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందన్న టాక్ నడుస్తొంది. సెంట్రల్ వైసీపీ అభ్యర్ధిత్వాన్ని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఖరారు చేసిన నేపథ్యంలో మల్లాది విష్ణు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. వైసీపీ లో టికెట్ దక్కని వారు మళ్లీ తిరిగి తమ పాత పార్టీలోకే వెళ్లారని అంటున్నారు. దీని వల్ల పార్టీ రాష్ట్రంలో మెరుగుపడుతుందని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది.
ఆ పార్టీ లెక్క అలా ఉంటే.. రాబోయే ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏ రాజకీయ పార్టీ ప్రభావం ఉంటుంది..? వైసీపీకి నష్టం జరుగుతుందా..? లేక లాభమా.. ప్రతిపక్ష టీడీపీ – జనసేన కూటమికి లాభం జరుగుతుందా..? నష్టం వాటిల్లుతుందా..? అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరికి తోచినట్లుగా వారు ఊహించుకుంటున్నారు. షర్మిల ప్రభావం అంతగా ఉండదని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.
వైఎస్ఆర్ రాజకీయ వారసుడుగా జగన్మోహనరెడ్డినే ప్రజలు నమ్ముతున్నారని, జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు జనం వెంటే ఉన్నారని, ఎవరో కొందరు నాయకులు షర్మిల వెంట వెళ్లినా పెద్దగా జరిగే నష్టం ఉండదని వారు అంటున్నారు. గతంలో నందమూరి తారక రామారావు కుమారుడు హరికృష్ణ, ఆయన భార్య నందమూరి లక్ష్మీ పార్వతి రాజకీయ పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించలేదని, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకే ఆ పార్టీ నేతలు అండగా నిలిచారని ఉదాహరణగా చెబుతున్నారు.
అదే విధంగా ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందరేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా చేసినా ఎన్టీఆర్ అభిమానులు ఆమెను చూసి బీజేపీలోకి చేరిన వాళ్లు ఎవరూ లేరని చెబుతున్నారు. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం మొత్తం ప్రధాన ప్రతిపక్షానికి వెళ్లకుండా కొంత మేర కాంగ్రెస్ పార్టీకి వెళ్లడం వల్ల వైసీపీకి మేలు చేసినట్లే అవుతుందని అంటున్నారు. ఇదే లెక్కలను వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ అనుకూల మీడియా ఆ విధంగానే చెబుతోంది.
మరో పక్క టీడీపీ అనుకూల మీడియా మాత్రం షర్మిల కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయితే అది వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తద్వార ప్రతిపక్ష కూటమికి లాభం చేకూరుతుందని విశ్లేషణలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎంత మేర ఓటు బ్యాంకు పెంచుకుంటే అదంతా వైసీపీకే నష్టమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరడం వల్ల టీడీపీ, జనసేన నుండి కాంగ్రెస్ పార్టీకి వలసలు ఏమీ ఉండవనీ, వైసీపీ నుండే కాంగ్రెస్ కు వలసలు ఉంటాయని చెబుతున్నారు. షర్మిల వల్ల కాంగ్రెస్ రాష్ట్రంలో బలపడుతుందా.?.ఏ పార్టీపై ఆ ప్రభావం పడుతుంది అనేది తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే..!