TDP: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేశినేని బ్రదర్స్ (ఎంపీ కేశినేని నాని, కేశినేని చిన్ని) పంచాయతీ టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వరుసగా రెండు సార్లు గెలిచిన ఎంపీ కేశినేని నాని రాబోయే ఎన్నికల్లోనూ మూడో సారీ విజయం సాధించి హాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. గడచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఫ్యాన్ గాలి బలంగా వీచి ఆ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలు కైవశం చేసుకున్నా, టీడీపీ మూడు ఎంపీ స్థానాలనే గెలుచుకుంది.
గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి గల్లా జయదేవ్, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుండి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి కేశినేని నాని విజయం సాధించిన సంగతి తెలిసిందే. పార్టీ ఓటింగ్ కు తోడు వ్యక్తిగత ఇమేజ్ కారణంగా క్రాస్ ఓటింగ్ ప్రభావంతో ఈ నేతలు గెలిచారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో కేశినేని నాని తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అందించిన సంక్షేమం వల్ల రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినా ప్రజలు ఆశీర్వదిస్తారు అనే భావనతో ఉన్నారు.
తన పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులను అధికార వైసీపీ ఎమ్మెల్యేల సిఫార్సులపైనా విడుదల చేస్తూ పలువురు వైసీపీ నేతల మన్ననలు పొందారు కేశినేని నాని. అయితే గత ఎన్నికల తర్వాత సోదరుడితో విభేదాల కారణంగా కేశినేని చిన్ని రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. దీంతో పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కేశినేని నాని వ్యతిరేకులు చిన్నిని ప్రోత్సహించడం మొదలు పెట్టారు. దీంతో పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని నాని, చిన్ని వర్గాలుగా టీడీపీ శ్రేణులు డివైడ్ అయ్యారు. చాలా కాలంగా టీడీపీలో నాని వర్సెస్ చిన్ని అన్నట్లుగా పరిస్థితులు ఉన్నా టీడీపీ అధిష్టానం దీనిపై దృష్టి పెట్టలేదు.
ఎంపీ కేశినేని నాని చంద్రబాబుతో సన్నిహితంగా వ్యవహరిస్తూ ఉండగా, కేశినిని చిన్న చిన బాబు నారా లోకేష్ కు దగ్గరగా వ్యవహరిస్తూ వచ్చారు. లోకేష్ యువగళం పాదయాత్రలోనూ తన హవా ఆయనకు చూపించారు. పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ నియోజకవర్గాల టీడీపీ ఇన్ చార్జిలు చిన్నికి మద్దతుగా మారారు. కాగా, వీరి వర్గీయుల మధ్య నెలకొన్న విభేదాలు తారా స్థాయికి చేరడంతో రెండు రోజుల క్రితం తిరువూరు పార్టీ ఆఫీసులో నాని, చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో ఓ పోలీస్ అధికారికి గాయాలు అయ్యాయి.
ఈ పరిణామంతో టీడీపీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ప్రస్తుత ఎంపీ కేశినేని నానికి ఈ సమాచారాన్ని పార్టీ అధిష్టానం తెలియజేసింది. ఈ విషయాన్ని కేశినేని నానే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తానని నాని తెలిపారు.
“అందరికీ నమస్కారం. నిన్న (గురువారం) సాయంత్రం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురాంగారు మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ గారు నన్ను కలసి 7 వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జ్ గా చంద్రబాబు గారు నియమించారని కాబట్టి ఆ విషయంలో నన్ను కలగ చేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియచేసారు.
అట్లాగే రాబోయే ఎన్నికలో నా స్థానంలో విజయవాడ లోక్ సభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియచేసారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి నేను హామీ ఇచ్చా” అని కేశినేని నాని పేర్కొన్నారు.
YS Sharmila: షర్మిల కాంగ్రెస్ పార్టీ చేరికలో ఓ ట్విస్ట్ .. బ్రదర్ అనిల్ ఏమి చేశారంటే..?