YSRCP: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో ..వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరో సారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు హజరు కావాలని మరో సారి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు స్పీకర్ తమ్మినేని.
ఈ సారి వాళ్ల నుండి పూర్తి స్థాయి వివరణ తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అధికార వైసీపీ నుండి ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు టీడీపీకి ఫిర్యాయించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరికి స్పీకర్ మరో సారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీన విచారణకు హజరుకావాలని ఆదేశించారు.
మరో పక్క రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ నెల 15వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఈ పోలింగ్ లోపుగా వీరిపై అనర్హత వేటు పడితే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోతారు. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తమపై అనర్హత పిటిషన్ వేశారని వీరు పేర్కొంటున్నారు.
ఇప్పటికే వైసీపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గోళ్ల బాబూరావు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త మేడా రఘునాథ రెడ్డి లు వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులుగా ఈ నెల 12వ తేదీ న నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం. క్రాస్ ఓటింగ్ జరగకుంటే అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ముగ్గురు వైసీపీ అభ్యర్ధులు విజయం ఖాయమే. అధికార వైసీపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్ధిని పోటీకి నిలిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.