Gyanvapi: ఉత్తర ప్రదేశ్ లోని జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సోమవారం అలహాబాద్ హైకోర్టు సమర్ధించింది. ఈ ప్రార్ధనా మందిరం సెల్లార్ లో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతించేలా దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ లను హైకోర్టు కొట్టేసింది.
ఉత్తరప్రదేశ్ వారణాసి లో గల కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి ప్రార్థనా మందిరం విషయంలో యాజమాన్య హక్కుల కోసం కొన్నేళ్లుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. జ్ఞానవాపి నేలమాళిగలోనే శివాలయం ఉన్నట్లు పేర్కొంటున్న ప్రాంతంలో పూజించే హక్కు హిందువులకు ఉందని వారణాసి జిల్లా కోర్టు ఇటీవల తెలిపింది. కాశీ విశ్వనాధ ఆలయ పూజారులే ఈ పూజలు నిర్వహించాలని వెల్లడించింది. ఈ మేరకు బారికేడ్లు తొలగించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నేలమాళిగలోని ఆలయంలో పూజలు చేసేందుకు సోమనాథ్ వ్యాస్ మనుమడు శైలేంద్ర పాఠక్ అనుమతి కోరారు. ఈ పూజలు క్రమం తప్పకుండా జరుగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన వారణాసి జిల్లా న్యాయమూర్తి డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేష్ ఈ మేరకు గతంలో తీర్పు వెల్లడించారు.
సోమనాథ్ వ్యాస్ కుటుంబం 1551 నుండి అర్చక సేవలో కొనసాగుతోంది. 1992 లో ఉత్తర ప్రదేశ్ లోని బాబ్రీ మసీదు కూల్చివేత తర్వతా జ్ఞానవాపి లోని దక్షిణ నేలమాళిగలో పూజలను నిరాకరిస్తూ వ్యాస్ కు మౌఖికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 1993 డిసెంబర్ లో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేలమాళిగలో పూజలను నిషేదించింది. దీనిపై సోమనాథ్ వ్యాస్, రామ్ రంగ్ శర్మ, హరిహర్ పాండే లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సర్వే నంబర్లు 9130, 31,31 లు కాశీ విశ్వనాధుడి ఆస్తి అని పేర్కొన్నారు.
జ్ఞానవాపి మసీదు అంతకు ముందు ఉన్న హిందూ ఆలయ నిర్మాణంపైనే నిర్మితమయిందా అన్న విషయం తేల్చేందుకు గతంలో వారణాసి కోర్టు అక్కడ ఏఎస్ఐ సర్వే జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) నివేదిక ఇచ్చింది. ప్రస్తుత నిర్మాణం అంతకు ముందున్న నిర్మాణంపైన కట్టిందేనని సర్వేలో తేలింది. దీంతో హిందూ పక్షం వారు పూజలు చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వాలని కోరగా ఇటీవల వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ (ఏఐఎంసీ) అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ బెంచ్ కొట్టివేసింది. నాలుగు రోజుల పాటు పిటిషన్ పై వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 15న కోర్టు తీర్పు రిజర్వు చేసింది. మసీదు సెల్లార్ లో హిందువుల పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై మసీదు కమిటీ సుప్రీం కోర్టుకు వెళ్లగా పిటిషన్ విచారించేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం.. హైకోర్టుకే వెళ్లాలని సూచించింది.
Janasena: జనసేన పోటీ చేసే 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు ఇవే..?