Janasena: టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తొంది. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడు లోక్ సభ స్థానాల పరిధిలోని 21 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం 45 స్థానాల్లో తమ పోటీ ప్రభావం ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు.
తెనాలి, అనకాపల్లి, నెల్లిమర్ల, కాకినాడ రూరల్, రాజానగరం లో పోటీ చేసే తమ అభ్యర్ధుల పేర్లను పవన్ తొలి జాబితాలోనే ప్రకటించేశారు. వీటిలో అనకాపల్లి, కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానాల్లో జనసేన, టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉండటంతో పాటు 2009 ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్ధులు గెలిచారు. మిగిలిన మూడు నియోజకవర్గాల్లోనూ జనసేనకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. జనసేన, టీడీపీ సమన్వయంతో ముందుకు సాగితే ఈ అయిదు నియోజకవర్గాల్లో జనసేన గెలుపు ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అందుకే నూరు శాతం గెలుపు అవకాశాలు ఉన్న అయిదు నియోజకవర్గాలను పవన్ కళ్యాణ్ ప్రకటించారని భావిస్తున్నారు.
ఇక గతంలో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు లో తమ పార్టీయే పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ ఆరు స్థానాలపై స్పష్టత వచ్చేసినట్లు అయ్యింది. మిగిలిన 18 స్థానాల్లోనూ మెజార్టీ సీట్లు దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తొంది. వాటిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, అమలాపురం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, నిడదవోలు, పోలవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాలు, ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ పశ్చిమ, ఆవనిగడ్డ, ఉమ్మడి విశాఖ జిల్లాలో యలమంచిలి, భీమిలి, గాజువాక, పెందుర్తి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ జనసేనకు ఖరారు అయినట్లుగా తెలుస్తొంది.
రాజమండ్రి రూరల్ పై జనసేన పట్టుబట్టినప్పటికీ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండటంతో చంద్రబాబు ఈ స్థానం విషయంలో ప్రత్యామ్నాయంగా నిడదవోలు స్థానాన్ని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తొంది. మరో పక్క ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ గతంలో దర్శి స్థానాన్ని కోరగా, తాజాగా గిద్దలూరు కూడా జనసేన కు ఇస్తున్నట్లు సమాచారం.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం లేదా పుట్టపర్తి, కడప జిల్లాలో బద్వేల్ లేదా రైల్వే కోడూరు స్థానాలను జనసేన ఆశిస్తున్నట్లు తెలుస్తొంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె స్థానం నుండి జనసేన పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక లోక్ సభ సీట్ల విషయానికి వస్తే కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లిలో జనసేన పోటీ చేయనుంది.
RK Roja: మంత్రి ఆర్కే రోజాకు మరో సారి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత .. ఈ సారి టికెట్ కష్టమేనా..?