ఎన్నికలకు ముందు వైసీపీ చేపట్టిన కొత్త ప్రచార కార్యక్రమం సిద్ధం సభలు. ఇప్పటికి మూడు సార్లు ఈ సభలు నిర్వహించారు. కానీ, ఆఖరిది, నాలుగోదీ(ఎన్నికల షెడ్యూల్కు ముందు) అయిన సిద్ధం సభ విషయంలో మాత్రం వైసీపీ వాయిదాల పర్వం కొనసాగుతోంది. దీనికి కారణమేంటి? ఎందుకు వాయిదా పడుతోంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఈ వాయిదాల వెనుక ప్రధాని మోడీ ఉన్నారని వైసీపీ వర్గాల్లో చర్చసాగుతోంది. అదేంటి? వైసీపీ సిద్ధం సభలకు మోడీకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు చిక్కు.
ఆఖరి సిద్ధం సభ ద్వారా.. వైసీపీ తన మేనిఫెస్టోను ప్రవేళ పెట్టాలని నిర్ణయించుకుంది. దీనిలో మరిన్ని సంచలన పథకాలు పెట్టా లని యోచిస్తోంది. ఈ క్రమంలో కీలకమైన డ్వాక్రా, రైతు రుణమాఫీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. వీటిని మేనిఫెస్టోలో పెట్టి వచ్చే ఎన్నికల్లో మేళ్లు పొందాలని జగన్ భావిస్తున్నారు. కానీ, అధికారంలో ఉండగా.. గుర్తుకు రానివి.. ఎన్నికలకు ముందు గుర్తుకు వచ్చాయా? అనే ప్రతిపక్షాల విమర్శలు ఉండనే ఉంటాయనివైసీపీ అంచనా వేసింది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందే.. వీటిని అంతో ఇంతో అమలు చేసి.. పూర్తిస్థాయిలో రుణ మాఫీ పథకాలను ఎన్నికల తర్వాత.. అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాలని భావిస్తోంది.
అయితే.. ఇది అనుకున్నంత ఈజీకాదు. ఎందుకంటే.. రుణ మాఫీ అంటే నిధులు కావాలి. ఇదే ఇప్పుడు సీఎం జగన్ను ప్రధాని మోడీ కోసం వేచి చూసేలా చేస్తోంది. మోడీ అప్పాయింట్మెంట్ ఇస్తే.. ఆయనను ఏదో ఒక రూపంలో ఒప్పించి అప్పులు తెచ్చు కునేందుకు మార్గం సుగమం చేసుకోవాలన్నది జగన్ ఆలోచన. ఈ క్రమంలోనే గత వారం నుంచి ప్రధాని అప్పాయింట్మెంట్ కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు. కానీ, ప్రస్తుతం మోడీ వచ్చే నెల 10 వరకు రాష్ట్రాల పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తాజాగా ఆయన తెలంగాణకు, తమిళనాడుకు వచ్చినప్పుడు అయినా.. తనకు అప్పాయింట్మెంట్ ఇస్తారని జగన్ భావించారు. అయితే..మోడీ ఆ చాన్స్ ఇవ్వలేదు.
దీంతో ఈ లోగానే ఆయనను ఏదో ఒక విధంగా ఒప్పించి పది నిమిషాల సమయం తీసుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తు న్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఇది ఓకే అయితే.. ఆయన నుంచి సొమ్ములపై హామీ తీసుకుని.. రైతు, డ్వాక్రా రుణమాఫీలపై ప్రకటన చేయడంతోపాటు అంతో ఇంతో నిధులు ఇచ్చేసి.. మేనిఫెస్టోలోనూ పెట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాలుగో సిద్ధం సభలు వాయిదా పడుతున్నాయనేది తాడేపల్లి వర్గాలు చెబుతున్న మాట. మరి మోడీ ఎప్పటికి కరుణిస్తారో చూడాలి.