ఏపీలో సాధారణ ఎన్నికలకు ముందుగా జంపింగ్ జపాంగ్ల జోరు మామూలుగా లేదు. ఒక పార్టీలో సీటు రాని నేతలు.. ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడమో లేదా… వారికి ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు అందడమో జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు కూడా టీడీపీ అధిష్టానం సీటు ఇవ్వట్లేదని దాదాపు ఖరారైంది. చివర్లో పరిణామాలు మారితే తప్పా ఉంగుటూరు సీటు జనసేనకు వెళ్లడం ఫిక్స్ అయ్యింది. చంద్రబాబు సైతం నేరుగా గన్నికే ఫోన్ చేసి పొత్తులో భాగంగా త్యాగాలు చేయాలని కోరగా గన్ని సైతం గట్టిగానే తన వాదన వినిపించారు.
బాబుతో ఫోన్లో గన్ని వాదన ఇది…
నియోజకవర్గంలో 2003 నుంచి 20 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన సూచన మేరకు జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టి.. జిల్లాలో పార్టీ పటిష్టత కోసం పనిచేశాను.. ఆ రోజు నాకు జిల్లా పార్టీ పగ్గాలు వద్దని చెప్పినా మీరు నామీద ఒత్తిడి చేసి నువ్వే ఏలూరు జిల్లా పగ్గాలు చేపట్టాలని కోరగా మీ సూచన మేరకే ఆ పదవి తీసుకున్నాను.. ఆర్థికంగా ఎంతో నష్టపోయాను.. నియోజకవర్గంలో పార్టీని మళ్లీ గెలిపించే స్థాయికి తెచ్చాను.. ఏనాడు వివాదాల్లోకి వెళ్లలేదు.. ఏ సర్వే అయినా చూసుకోండి… నాకు చిన్న రిమార్క్ ఉందేమో చూడండి.. ఇదంతా మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే అయితే.. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయంతో నాకు అవమానమే మిగిలిందని గన్ని చంద్రబాబుతో ఫోన్లోనే వాపోయారు.
గన్నికి సర్దిచెప్పిన చంద్రబాబు…
ఉంగుటూరుతో పాటు పొత్తులో త్యాగాలు చేయాల్సిన చోట .. అక్కడ పార్టీ నేతలకు ఫోన్ చేస్తోన్న చంద్రబాబు.. గన్నికి కూడా ఫోన్ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పొత్తుల నేపథ్యంలో కొన్ని త్యాగాలు తప్పవని.. ముందు నేను నిలబడాలంటే మీరు సాయం చేయాలి కదా… పార్టీ అధికారంలోకి వస్తే నీకు ప్రయార్టీ ఉంటుంది.. ఇన్చార్జ్గా నువ్వే ఉంటావు… నీకు ఇబ్బంది ఉండదు అని చెప్పడంతో పాటు మూడు రోజుల్లో వస్తున్నాను.. నీతో ప్రత్యేకంగా మాట్లాడతానని సముదాయించారు.
తీవ్ర అసంతృప్తితో ఉంగుటూరు టీడీపీ కేడర్…
ఒకటా రెండా 22 ఏళ్ల పాటు ఉంగుటూరు నియోజకవర్గానికి గన్ని వీరాంజనేయులు అంకితమై టీడీపీ కోసం పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బలంగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంపై పోరాటం చేయడంతో పాటు.. ఆ తర్వాత ఆయన తనయుడు జగన్ బలంగా ఉన్నప్పుడు కూడా జగన్ ప్రభుత్వంపై గన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో పోరాడారు. పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పుడు జిల్లా పార్టీ నాయకత్వాలు చేపట్టేందుకు ఎవ్వరూ ముందుకు రాని టైంలో గన్ని ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీని నడిపించారు. విచిత్రం ఏంటంటే 20 ఏళ్ల పాటు ఉంగుటూరులో టీడీపీకి గన్ని తప్పా మరో ఆప్షన్ కూడా లేరు.
చాలా పెద్ద నేతలు ఉన్న చోటే గ్రూపుల గోల ఉంటే.. ఉంగుటూరులో మాత్రం గన్ని నాయకత్వంలోనే సింగిల్ ఎజెండాతో పార్టీ ముందుకు వెళ్లింది. పైగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలాంటి సీటును జనసేనకు వదులుకోవడం పార్టీ నాయకత్వం చేసిన పెద్ద మిస్టేక్. పార్టీకి బలమైన నాయకత్వం లేదని.. లేదా కొత్త నాయకత్వం ఉన్న సీట్లు ఇచ్చుకోకుండా.. పార్టీకి స్ట్రాంగ్ బేస్ ఉన్న సీటు వదులుకోవడం మైనస్సే అవుతుందన్న చర్చలు కూడా వచ్చినా అవేవి అధినాయకత్వం చెవికి పట్టలేదు. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు కేవలం 10 వేల ఓట్లు వచ్చాయి. టీడీపీకి 60 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. 10 వేల ఓట్లు వచ్చిన పార్టీకి 60 వేల పై చిలుకు ఓట్లు ఎలా ? బదిలీ అవుతాయో తెలియదని.. పైగా 60 వేలు మాత్రమే కాదు.. మరో 20 వేలు అదనంగా జనసేనకు బదిలీ కావాల్సి ఉంటుందని. ఇది జరిగే పనికాదని.. టీడీపీ వాళ్లు ఓపెన్గానే చెపుతున్నారు.
గన్ని కోసం వైసీపీ వల…
ఇటు ఉంగుటూరు టీడీపీ ఇన్చార్జ్ గానే కాకుండా.. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా కూడా ఉన్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకు టిక్కెట్ దక్కదన్న టాక్తో వైసీపీ అధిష్టానం అలెర్ట్ అయ్యింది. ఇటీవల వరకు టీడీపీలోనే ఉండి వైసీపీలోకి వెళ్లిన విజయవాడ ఎంపీ కేశినేని నాని గన్నితో మాట్లాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీలోకి వస్తే ప్రాధాన్యత ఉంటుందని అటు వైపు నుంచి ఆపర్లు వల వేస్తున్నారు. అలాగే గన్ని కమ్మ నేత కావడంతో వైసీపీలోనే ఉన్న మరో కమ్మ ఎమ్మెల్యే కూడా గన్నిని టచ్లోకి తెచ్చుకునేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే గన్ని మాత్రం తాను నమ్ముకున్న పార్టీకి, తన అధినేతకు ఎంత మాత్రం నమ్మక ద్రోహం చేసే పరిస్థితే లేదని తేల్చిచెపుతున్నారు. తనకు ఇప్పటకి అయినా తన అధినేత న్యాయం చేస్తారన్న ధీమాతోనే ఉన్నారు. టిక్కెట్ రానిపక్షంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి సత్తా చూపుదామన్న కొందరు టీడీపీ నేతలపైనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పార్టీకి నష్టం కలిగించే చర్యలు వద్దని.. తుది వరకు వేచి చూద్దామని చెపుతున్నారు.