Chirajeevi – Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్ తొలిసారిగా సతీమణి అన్నా లెజునోవా, కుమారుడు అకీరా నందన్ తో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు.
తొలుత తల్లి హారతి ఇచ్చి పవన్ ను ఆశీర్వదించారు. తర్వాత చిరంజీవికి కాళ్లు మొక్కి పవన్ ఆశీర్వాదం అందుకున్నారు. కుటుంబ సభ్యులు అందరూ పవన్ ను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
పవన్ రాకతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. పెద్ద ఎత్తున అభిమానులు చిరంజీవి ఇంటి వద్దకు చేరుకున్నారు. జై పవన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో చిరు ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది.
కాగా, ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి చిరంజీవి తొలుత రూ.5కోట్ల విరాళం అందజేశారు. అనంతరం పవన్ కు మద్దతుగా సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఫిఠాపురంలో పవన్ కు మద్దతుగా వదిన సురేఖ, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అరవింద్, నాగబాబు ఇలా మొత్తం మెగా ఫ్యామిలీ ప్రచారం చేసింది.
గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయాడన్న అపవాదు పవన్ పై ఉండగా, ఈ సారి పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించడం, పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజార్టీతో విజయాన్ని అందుకోవడంతో మెగా కుటుంబంతో పాటు అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.