కర్నూలు: కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురవడంతో మహానంది ఆలయం జల దిగ్బంధంలో చిక్కకుంది. సిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొరనిపాడు మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 224 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలోని ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది. మహానంది ఆలయంలో మొదటి, రెండు ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. పంచలింగాల మండపం, కోనేరు పూర్తిగా నీట మునిగిపోయాయి. భారీగా వరద ప్రవాహం ఉండటంతో మహానంది ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. మహానంది పరిసర ప్రాంతాలు నీట మునిగిపోయాయి.
కుందూరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మహానందిలో పాలేరు వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. నంద్యాల, గాజులపల్లి, మహానంది మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.