(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : రాష్ర్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం చెబుతున్నా ఇది కారణమా లేక సాకా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరగడం లేదనీ బీజేపీతో సహా టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపించడం తెలిసిందే. అప్రజాస్వామిక విధానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కేంద్రానికి పిర్యాదు చేశారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నర్సింహారావు, సిఎం రమేష్, టీజీ వెంకటేష్ లు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిసి వినతి పత్రం ఇవ్వడం, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇస్తామని తెలియచేసిన 48 గంటల వ్యవధిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే కేంద్ర హోమ్ శాఖ జోక్యం చేసుకున్నదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్టంలోని వైసీపీ ప్రభుత్వంపై కాస్తో కూస్తో అనుకూలంగా మాట్లాడే బీజేపీ రాజ్యసభ సభుడు జీవిఎల్ నర్సింహారావు సైతం పోలీసులు, అధికారులు వైసీపీ కార్యకర్తలుగా పని చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడటం కరోనా సాకు మాత్రమేనని కేంద్రం జోక్యం చేసుకొని ఉంటుందని అనుకుంటున్నారు.
ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ నేటి ఉదయం వెల్లడించారు.‘కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఊహించని మార్పులు వచ్చాయన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, పేపర్ బ్యాలెట్ వల్ల కరోనా విస్తరించే ప్రమాదం ఉందని అన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నామని, పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆరు వారాల తర్వాత సమీక్ష జరిపి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే ఎన్నికలు నిర్వహిస్తామని అయన చెప్పారు. ఆరు వారాల తర్వాత ఎన్నికల ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుందన్నారు. ఆరు వారాల తర్వాత కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామనీ, కొన్ని చోట్ల బెదిరింపులకు దిగడం దారుణమనీ ఆయన అన్నారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామని, గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తున్నట్లు తెలిపారు. మాచర్ల సీఐపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆయన వెల్లడించారు.
ఎన్నికల వాయిదాపై సిఎం అసంతృప్తి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పై సి ఎం వై ఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన హుటాహుటిన రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంధన్ తో భేటీ అయ్యారు. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎటువంటి విచారణ చేయకుండా అధికారులను బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేయడంపై జగన్ గవర్నర్ కి ఫిర్యాదు చేశారు.