Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులనూ ఊరట లభించలేదు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. అదే విధంగా సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను కూడా న్యాయమూర్తి డిస్మిస్ చేశారు. ఏసీబీ కోర్టులు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ పై రెండు రోజుల క్రితం ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. కొద్దిసేపటి క్రితం రెండు పిటిషన్ లపై ఉత్తర్వులు జారీ చేశారు.
అటు ఏపీ హైకోర్టులోనూ చంద్రబాబుకు చుక్కెదురైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన మందస్తు బెయిల్ పిటిషన్ లను హైకోర్టు కొట్టేసింది. గత నెల 9వ తేదీ చంద్రబాబు ను సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దాదాపు నెల రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. చంద్రబాబు తరపున అటు ఏసీబీ కోర్టు, ఇటు హైకోర్టులో సుప్రీం కోర్టు న్యాయవాదులు వాదనలు వినిపించినా, ప్రభుత్వ న్యాయవాదుల వాదనలే న్యాయస్థానాల్లో నెగ్గాయి.
మరో పక్క చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవేళ విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఇరుపక్షాల వాదనలు వాడివేడిగా జరుగుతున్నాయి. సుప్రీం కోర్టు ధర్మాసనం నుండి ఎటువంటి ఉత్తర్వులు వెలువడతాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటీ వారెంట్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి.
చంద్రబాబు ముందస్తు బెయిల్, బెయిల్ పిటిషన్ లు డిస్మిస్ కావడంతో సీఐడీ చంద్రబాబును ఈ రెండు కేసుల్లోనూ అరెస్టు చూపి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలతో చంద్రబాబు మరి కొన్ని రోజులు కారాగార వాసం చేయాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి.