తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాళ్లు, ప్రతి సవాళ్లుతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఇద్దరు నేతలు చేసుకున్న ఆరోపణలపై బిక్కవోలులోని శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో సత్య ప్రమాణాలకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఆలయంలో తొలుత ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు, ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు సత్య ప్రమాణాలు చేశారు. రామకృష్ణారెడ్డి ప్రమాణం చేస్తున్న సందర్భంలో ఆరోపణలు చేయడం కాదు ప్రమాణం చేయాలంటూ సూర్యనారాయణరెడ్డి పట్టుబట్టారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తే పరిస్థితి ఏర్పడటంతో పోలీసు అధికారులు రంగప్రవేశం చేసి సత్య ప్రమాణాల కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా చూశారు.
నేతల సవాళ్ల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బిక్కవోలు, అనపర్తి మండలాల్లో 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ చట్టాన్ని అమలు చేస్తున్నారు. కార్యకర్తలు గుడిగూడి ఉండకూండా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఎమ్మెల్య సత్తి సూర్యనారాయణరెడ్డి పై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మైనింగ్ సహా పలు అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన సూర్యనారాయణరెడ్డి గణపతి ఆలయంలో ప్రమాణానికి సిద్దమంటూ రామకృష్ణారెడ్డికి సవాల్ విసిరారు. ఈ సవాల్ ను రామకృష్ణారెడ్డి స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు సతీసమేతంగా ఆలయానికి వచ్చి ప్రమాణాలు చేశారు.