AP Assembly: జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై చర్చ జరగాలని పట్టుబడుతూ టీడీపీ సభ్యులు అసెంబ్లీ లో ఆందోళన కొనసాగిస్తుండటంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ వారిని సస్పెండ్ చేశారు. నిమ్మకాయల చిన రాజప్ప, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ తదితర టీడీపీ సభ్యులను ఈ రోజు సెషన్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభా వ్యవహారాలు సవ్యంగా జరగాలన్న ఉద్దేశంతో బాధతోనే సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు.
తొలుత టీడీపీ సభ్యుల ఆందోళనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని జగన్ హితవు పలికారు. 55వేల జనాభా ఉన్న చోట ఎవరైనా సారా కాస్తారా అని ప్రశ్నించారు. నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సారా తయారీ సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే నమ్మే విధంగా ఉండాలని అన్నారు. టీడీపీ సభ్యుల సస్పెండ్ అనంతరం బడ్జెట్ పై చర్చ కొనసాగుతోంది. సోమవారం కూడా టీడీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో అచ్చెన్నాయుడుతో సహా అయిదుగురు టీడీపీ సభ్యులను బడ్జెట్ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.