Hijab Row: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు నేడు సంచలన తీర్పు వెల్లడించింది. విద్యాసంస్థలో హిజాబ్ తప్పనిసరి కాదని పేర్కొంది హైకోర్టు. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. విద్యాసంస్థల ప్రొటోకాల్ ను విద్యార్ధులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక లో ప్రారంభమైన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. పలు రాష్ట్రాల్లో హిజాబ్ పై వివాదాలు చోటుచేసుకున్నాయి. విద్యా సంస్థల్లో హిజాబ్ను అనుమతించేది లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్ణాటక ప్రభుత్వ అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు నేడు కీలక తీర్పు ఇచ్చింది. .
హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి అవసరమైన ఆచారం కాదని కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఇస్లాంలోనూ హిజాబ్ తప్పనిసరన్న నిబంధన లేదని చెప్పింది. విద్యాసంస్థల్లో యూనిఫాం నిబంధన పాటించాల్సిందేనని పేర్కొంది. కాగా హిజాబ్ తీర్పు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. హిజాబ్ వివాదం నేపథ్యంలో ఉడుపిలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
కర్ణాటక హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును అందరూ పాటించాలన్నారు. వివాదాలకు తెరదించి విద్యార్ధులు చదువుపై దృష్టి పెట్టాలని జోషి సూచించారు. శాంతి, సామరస్యంతో ముందుకు సాగాలని అన్నారు మంత్రి జోషి. మరో పక్క హైకోర్టు తీర్పును పిటిషనర్లు సుప్రీం కోర్టు సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.