AP CM YS Jagan: ఏపిలో నూతన విద్యావిద్యానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త విద్యావిధానంలో ఆరు రకాలుగా పాఠశాలలను వర్గీకరణ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పీపీ – 1 నుండి 12వ తరగతి వరకు ఆరు రకాలుగా వర్గీకరణ ఉంటుందని వివరించారు. వర్గీకరణతో 14 వేల పాఠశాలలు అదనంగా అవసరమని అధికారులు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా ఉపాధ్యాయులు ఉండాలన్నారు. ఉపాధ్యాయుల అనుభవం, భోదనలో వారికి ఉన్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 16న పశ్చిమ గోదావరి జిల్లా లో విద్యాకానుక ప్రారంభం కానుందని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులను ఉంచడంపై తయారు చేసిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకి వివరించారు. మూడవ తరగతి నుండి నిపుణులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన జరగాలన్నారు. ప్రపంచ స్థాయి పోటీకి తగినట్లుగా విద్యార్థులు తయారవుతారని చెప్పారు. ఇంగ్లీషు మీడియంలో బోధన అందుతుందని, తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ గా బోధించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
నూతన విద్యా విధానం, నాడు – నేడు కోసం రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తేవాలని, నూతన విద్యా విధానం ఉద్దేశాలను వివరంగా తెలియజేయాలని సీఎం అధికారులకు సూచించారు. కలెక్టర్ లు, జెసీలు, డీఈఓలు, పీడీలకు అవగాహన కల్పించాలన్నారు. అమ్మఒడి, ఇంగ్లీషు మీడియం, నాడు – నేడు వల్ల క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.