CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలపై బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వరద బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చామని, నష్టపరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అధికారులు వారం పాటు గ్రామాల్లోనే ఉండి వరద బాధితులకు నిత్యావసరాలు అందించారని పేర్కొన్నారు.
వరద వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.10వేలు ఇవ్వాలని, ఇళ్లలోకి నీరు వచ్చిన వారికి రూ.2వేలు ఆర్ధిక సాయం ఇచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి తనకు చెప్పాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదనీ, ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలన్నదే తమ తాపత్రయమనీ, డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం తమ ప్రభుత్వానికి లేదని జగన్ స్పష్టం చేశారు.
పోలవరం నిర్వాసితులకు ఎన్నికలకు ముందే పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఆరు, ఏడు నెలల్లోనే పరిహారం అందేలా చూస్తామని తెలిపారు. మాతో (రాష్ట్ర ప్రభుత్వం) సంబంధం లేకుండా నేరుగా కేంద్రం నుండి నిర్వాసితుల అకౌంట్లలో డబ్బులు వేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీకి చెప్పానన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబులాగా అన్ని మాకే ఇచ్చేయండి చేసేస్తామని చెప్పడం లేదన్నారు. ఈ నెలాఖరులోగా కేంద్ర కేబినెట్ పోలవరం మొదటి దశ పరిహరానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని సీఎం జగన్ తెలిపారు. క్రెడిట్ తమకు అవసరం లేదనీ, నిర్వాసితులకు పరిహారం చెల్లించే బటన్ ప్రధాని మోడీ నొక్కినా ఫర్వాలేదని అన్నారు. ఎన్నికల్లోపే అంటే వచ్చే ఆరేడు నెలల్లోనే పోలవరం మొదటి దశ పరిహారం పూర్తవుతుందని అన్నారు.
మరో 48 ఆవాసాలకు మొదటి దశ పరిహారంలో చేర్చేలా కేంద్రాన్ని ఒప్పించామన్నారు. 41.15 మీటర్ల కు మొదటి దశ పోలవరం పూర్తవుతుందన్నారు. పోలవరం డ్యామ్ సెక్యురిటీ ప్రకారం మూడు దశల్లో నీళ్లు నింపాలన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6.8 లక్షలతో పాటు రాష్ట్రం వాటా రూ.3.2 లక్షలు కూడా కలిపి ఇస్తామని తెలిపారు. పోలవరం రెండు, మూడు దశల్లో కూడా ఇదే రకంగా పరిహారం పూర్తి చేస్తామని అన్నారు. పోలవరం పరిహారం కోసం తాను గట్టిగా కృషి చేస్తున్నానని, గత ప్రభుత్వం లాగా అన్ని తానే చేయాలని అనుకోవడం లేదని చంద్రబాబుకు కౌంటర్లు వేశారు. 2013 రేట్లకు పోలవరం పరిహారం ఇవ్వాలని చంద్రబాబు బుద్ది లేకుండా సంతకం పెట్టారని సీఎం జగన్ విమర్శించారు. పోలవరం విషయాలు అన్నీ తాను చెప్పినట్లు కఛ్చితంగా జరుగుతాయని అన్నారు.