Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి సోమవారం భారీ విరాళం అందింది. చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శేఖర్ రెడ్డి నేతృత్వంలో తొమ్మిది మంది దాతలు కలిసి టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం అందించారు. దాతలు ఈ మొత్తానికి సంబంధించిన డీడీని సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు. చెన్నై టి నగర్లోని వెంకటనారాయణ రోడ్లో ప్రస్తుతం ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ కోసం స్థలం కొనుగోలుకు ఈ మొత్తాన్ని దాతలు అందించారు. ఈ ఆలయానికి ఆనుకుని ఉన్న రూ.35 కోట్ల విలువైన 5.5 గ్రౌండ్ల స్థలాన్ని చెన్నై స్థానిక సలహామండలి గుర్తించింది. ఈ స్థలం కొనుగోలుకు గతంలో కొంత మంది దాతలు 8,15,15,002 రూపాయలను విరాళంగా అందించారు.
ప్రస్తుతం విరాళం అందించిన దాతలు ర్యాపిడ్కేర్ గ్రూపు రూ.1.50 కోట్లు, కోయంబత్తూరుకు చెందిన శ్రీ వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీ నాగరాజన్, సిఆర్ కన్ స్ట్రాక్షన్స్ వారు ఒక్కొక్కరు కోటి రూపాయలు, శ్రీ శ్రీశరణ్, శ్రీ శెంబగమూర్తి ఒక్కొక్కరు 20 లక్షలు, శ్రీ నరేష్ సుబ్రహ్మణ్యం, శ్రీ బలహా కెమికల్స్(పి) లిమిటెడ్ వారు ఒక్కొక్కరు రూ. 10 లక్షలు, నీలాద్రి ప్యాకింగ్స్ రూ.1లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు, నూతనంగా టీటీడీ చైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
CM YS Jagan: పోలవరం నిర్వాసితులకు సీఎం జగన్ గుడ్ న్యూస్