AP DGP: కర్నూలు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఇన్సిడెంట్ ను పురస్కరించుకుని కొందరు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆత్మకూరులోని పద్మావతి విద్యాసంస్థ వెనుక భాగంలో మసీదు నిర్మాణంపై ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. అక్రమంగా మసీదు నిర్మిస్తున్నారంటూ బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో కొందరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై జిల్లా పోలీస్ యంత్రాగం వెంటనే అప్రమత్తమై ఆత్మకూరులో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించింది.
AP DGP: మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు
ఈ ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ గా స్పందించారు. ప్రస్తుతం ఆత్మకూరులో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పేర్కొన్న డీజీపీ సవాంగ్.. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లాలో కొంత మంది కావాలనే మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు గౌతమ్ సవాంగ్. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశిస్తూ ఆత్మకూరు ప్రాంతంలో పరిస్థితులను పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీకి డీజీపీ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు.
మరో పక్క ఆత్మకూరులో జరిగిన ఘటనను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీజేపీి జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి సత్యనారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి జైచంద్ర లపై జరిగిన దాడిని ఖండిస్తూ నిందితులపై కేసులు నమోదు చేసి బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.