AP Employees PRC Issue: నూతన పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నెల 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 6వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ పలు మార్లు చర్చలకు ఆహ్వానించినా ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లలేదు. నూతన పీఆర్సీ జీవో వెనక్కు తీసుకుంటేనే చర్చలు వస్తామని సంఘాల నేతలు స్పష్టం చేశారు. అయితే లిఖితపూర్వకంగా ఆహ్వానం పంపితే కమిటీతో భేటీకి హజరు అవుతామని సంఘాల నేతలు పేర్కొన్న నేపథ్యంలో చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలకు లిఖితపూర్వకంగా సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ రాశారు.
AP Employees PRC Issue: సమ్మె విరమించేలా ఉద్యోగులను ఒప్పించాలి
మంగళవారం (నేడు) మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీతో సమావేశం ఉంటుందని చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీలోని 20 మంది సభ్యులకు ఆహ్వానం పంపారు. నూతన పీిఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతుండగా, నూతన పీఆర్సీతోనే జనవరి నెల వేతనాల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఉద్యోగుల సమ్మెను ఎలాగైనా విరమింపజేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం సత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ కలెక్టర్ లను ఆదేశించారు. నిన్న కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ ..సమ్మె విరమించేలా ఉద్యోగులను ఒప్పించాలని సూచించారు. ఉద్యోగులు అందరూ ప్రభుత్వంలో భాగమని కలెక్టర్ లు నచ్చజెప్పాలని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఉద్యోగులు సమ్మెకు వెళితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఉద్యోగులు ఆలోచించాలన్నారు.
హెచ్ఆర్ఏ స్లాబ్ లలో సవరణ, ఐఆర్ రికవరీ తీసివేతకు ప్రభుత్వం సుముఖత
మరో పక్క ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ అధికారులు నిన్న సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. హెచ్ఆర్ఏ స్లాబులలో సవరణలు చేసేందుకు, ఐఆర్ రికవరీ తీసివేత, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటామ్ ఆఫ్ పెన్షన్ అంశంలో సవరణలకు ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల నేతలతో నేడు జరిగే మంత్రుల కమిటీ భేటీలో వీటిపై హామీలను ఇచ్చి సమ్మె విరమణకు ఒప్పించే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. అయితే ఉద్యోగ సంఘాల నేతలు నూతన పీఆర్సీ జివో రద్దు చేయకుండా హెచ్ఆర్ఏ స్లాబ్ ల సవరణ, ఐఆర్ రికవరీ తీసివేత హామీలపై ఎలా స్పందిస్తారు అనేది సాయంత్రానికి తేలనుంది.