AP Govt: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ పది పదిహేను రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించనున్నది. సచివాలయ ఉద్యోగ సంఘ నేతల గురువారం సీఎం జగన్ కలిసి పిఆర్సీపై మాట్లాడారు. ఈ సందర్భంలో వారికి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. డిసెంబర్ మొదటి వారంలోగా పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారుట. ఈ విషయాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నందున అధికారులు, నేతలు ఆ బిజీలో ఉన్నారనీ, సమావేశాలు ముగిసిన వెంటనే పిఆర్సీపై నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం.
AP Govt: అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆలస్యం
గత కొద్ది రోజులుగా ఏపిలో ఉద్యోగుల పీఆర్సీ హాటా టాపిక్ గా ఉంది. ప్రభుత్వం పిఆర్సీపై ఏమీ తేల్చకపోతే ఈ నెలాఖరు నుండి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో సచివాలయ ఉద్యోగుల సంఘ నేతలు సీఎం జగన్ ను కలవగా సానుకూలంగా స్పందించారు. ఉగ్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెబుతోంది. 11వ పీఆర్సీ కమిటీ చైర్మన్ అశుతోష్ మిశ్రా తన నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ నివేదికను బహిర్గతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ మూలంగానే పీఆర్సీ ప్రకటనలో జాప్యం జరిగిందని భావిస్తున్నారు.