విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన అంశంలో కీలక పరిణామం చోటుచేసుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రిటైర్డ్ సీబీఐ జేడీ వీ వీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపి హైకోర్టు ఇవేళ విచారణ జరిపింది. పిటిషనర్ లక్ష్మీనారాయణ తరపు న్యాయవాది బాలాజీ హైకోర్టులో వాదనలు వినిపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అర్టికల్ 21 కు విరుద్దమని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం వేలాది మంది రైతుల నుండి 22వేల ఎకరాలు సేకరించారనీ, 9,200 మంది కుటుంబాలకు ఇంత వరకూ ఉద్యోగాలు ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని కుటుంబాల్లో నాల్గో తరం వచ్చినా ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని న్యాయవాది బాలాజీ హైకోర్టుకు వివరించారు.
మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తొందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రైవేటీకరణ కు బదులు అనేక ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించామని తెలిపారు. పిటిషనర్, రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం .. కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆర్ఐఎస్ఎల్, స్టీల్ ప్లాంట్ లను అదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ అంశంపై కేంద్రానికి లేఖలు రాశారు. రాష్ట్రంలోని బీజేపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై వెనక్కు తగ్గేది లేదని కేంద్రం ఇప్పటికే పార్లమెంట్ లో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కేంద్రం గతంలోనే ఏపి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.