AP High Court:రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఏపీ హైకోర్టు టికెట్ల వ్యవహారంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ (జేసి) ముందు ఉంచాలనీ, వారే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 35ను సవాల్ చేస్తూ థియేటర్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా, సింగిల్ జడ్జి విచారణ జరిపి ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో పిటిషన్లకు ఊరట లభించినట్లు అయ్యింది.
అయితే సింగిల్ జడ్జి అదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణతో కూడి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. థియేటర్ యజమాన్యాలు ధరలు పెంచి టికెట్లు విక్రయిస్తే సామాన్యులపై భారంపడుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ధర్మాసనం ..టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమాన్యాలు జేసి ముందు ఉంచాలని ఆదేశించింది. ధరలపై నిర్ణయం జేసియే తీసుకుంటారని పేర్కొంది. టికెట్ ధరలపై ప్రభుత్వం ఒ కమిటీని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారంకు వాయిదా వేసింది.
సినిమా టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత డి సురేష్ తదితర ప్రముఖులు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుండి స్పందన రాలేదు. త్వరలో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ధరలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పెద్ద నిర్మాతలకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది.