AP Legislative council: ఏపి శాసనమండలి నుండి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. గురువారం సభ ప్రారంభమైనప్పటి నుండి టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. రాష్ట్రంలో మద్య నిషేదం అమలుపై చర్చించడంపై టీడీపీ సభ్యలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. ఈ సందర్భంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రోజు టీడీపీ సభ్యులు సభకు అడ్డుతగులుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క టిస్టలరీకి అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, బూమ్ బామ్ బీరు లకు ఎవరు పర్మిషన్లు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
టీడీపీ సభ్యులు చిడతలు వాయిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్ బాబు, దీపక్ రెడ్డి, ప్రభాకర్, రామ్మోహన్, రామారావు, రవీంద్రనాథ్, రాజనర్సింహులు ఉన్నారు.
మండలిలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు ఈ స్థాయిలో దిగజారిపోతారని అస్సలు ఊహించలేదన్నారు. టీడీపీ సభ్యులు బిచ్చగాళ్లలా వ్యవహరిస్తున్నారన్నారు. పెద్దల సభలో చిల్లరగా గలాభా చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు బయట నుండి సభను కంట్రోల్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అనంతరం చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు.