Army Chopper Crash: తమిళనాడులో త్రివిధ దళాధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కురబలకోట మండల వాసి కూడా ఉన్నారు. ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయి తేజ ఆర్మీలో లాన్స్ నాయక్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సాయి తేజ సీడీఎస్ బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ఆయనతో జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలైయ్యారు. సాయి తేజ 2013లో రక్షణ శాఖలో చేరారు.
Army Chopper Crash: కుటుంబ సభ్యులతో మాట్లాడిన కొద్దిసేపటిలోనే..
ఈ రోజు ఉదయమే తన భార్యతో సాయి తేజ ఫోన్ లో మాట్లాడినట్లు సాయి తేజ బాబాయ్ సుదర్శన్ మీడియాకు తెలిపారు. ఉదయం 8.45 ప్రాంతంలో సాయి తేజ మదనపల్లిలో ప్రస్తుతం నివాసం ఉంటున్న భార్య శ్యామల, కుమార్తె దర్శిని, కుమారుడు మోక్షజ్ఞతో వీడియో కాల్ చేసి మాట్లాడినట్లు తెలిపారు. ఆ తరువాత కొద్ది గంటల్లోనే హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సాయి తేజ మృతితో గ్రామంలో విషాద ఛ్చాయలు అలుముకున్నాయి. సాయి తేజ గత వినాయక చవితి వేడుకలకు చివరి సారిగా గ్రామానికి వచ్చారు. కాగా ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తో సహా 13 మంది మృతి చెందారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.
సాయి తేజ ఆర్మీ ప్రస్తానం
సాయితేజ 2013లో బెంగళూరు రెజిమెంట్ నుండి రక్షణ శాఖలో సిపాయిగా ఎంపికయ్యారు. సిపాయిగా పని చేస్తూనే సంవత్సరం తరువాత పారా కమాండో పరీక్ష రాసి ఉత్తీర్ణుడైయ్యారు. తదుపరి 11వ పారాలో లాన్స్ నాయక్ హోదా లో పని చేస్తున్నారు. సంవత్సరం క్రితం వరకూ బెంగళూరులోని సిపాయిల శిక్షణా కేంద్రంలో ట్రైనర్ గా పని చేశారు. ఇటీవలే సీడీఎస్ బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతా దళంలో సభ్యుడుగా నియమితులైయ్యారు.