AP SEC : ఏపి నూతన ఎస్ఈసి నీలం సాహ్ని పరిషత్ ఎన్నికల నిర్వహణకు సన్నద్దం అవుతున్నారు. ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యదర్శి కన్నబాబుతో గతంలో ఆగిపోయిన ఎంపీటీసి, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యావాదాలు తెలియజేశారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని గవర్నర్ కు తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తో ఎస్ఈసీ కార్యాలయంలో నీలం సాహ్ని సమావేశం అయి ఎన్నికల నిర్వహణపై చర్చించారు. సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీ పాల్గొని ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం ఎస్ఈసీ ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
పరిషత్ ఎన్నికలకు సంబంధించి గత ఏడాది మార్చి ఏడున నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నామినేషన్ స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తి అయ్యాయి. ఆ నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి 15న పరిషత్ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుండి పెండింగ్ లో ఉన్న ఆ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో ఆ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నీలం సాహ్ని సిద్ధం అవుతున్నారు.