Badvel By Poll: ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ నేడు ప్రశాంతంగా పూర్తి అయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో అందరి దృష్టి దీనిపై ఉంది. అయితే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో సహా జనసేన పోటీ లో లేకపోవడంతో వైసీపీకి ప్రధాన ప్రత్యర్ధిగా బీజేపీ నిలిచింది. ఇక్కడ బీజేపీకి నియోజకవర్గ వ్యాప్తంగా ఏజెంట్ లను నియమించుకునే క్యాడర్ కూడా లేకపోవడంతో టీడీపీ, జనసేన కార్యకర్తలను ఏజెంట్ లుగా నియమించుకున్నట్లు వార్తలు వచ్చాయి,. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ వార్ ఒన్ సైడ్ కిందే లెక్క. కాకపోతే మెజార్టీ పైనే వైసీపీ దృష్టి సారించింది. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక జరగ్గా వైసీపీ ఆయన సతీమణి డాక్టర్ దాసరి సుధను బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్ధిగా నాన్ లోకల్ కు చెందిన సుధాకర్ ను దింపగా కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ ఉన్నారు. నేడు జరిగిన పోలింగ్ లో 68.12శాతం నమోదు అయ్యింది. ఇక ఈ నియోజకకవర్గంలో గెలుపు ఎవరిది, ఎంత మెజార్టీ వస్తుంది అన్నది చెప్పడం పెద్ద కష్టం ఏమీ కాదు.
* గత ఎన్నికల్లో అంటే 2019 లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి, ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది పరిశీలిస్తే… మొత్తం లక్షా 50వేల ఓట్లు పోల్ కాగా వైసీపీ అభ్యర్ధి డాక్టర్ వెంకట సుబ్బయ్యకు 95వేల ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్ధి ఓబులాపురం రాజశేఖర్ కు 50వేల ఓట్లు వచ్చాయి., బీజేపీకి కేవలం 750 ఓట్లతో డిపాజిట్ కూడా దక్కించుకులేదు. 45 వేల ఓట్ల ఆధిక్యతతో వైసీపీ అభ్యర్ధి గెలిచారు.
*2014 ఎన్నికల్లో వైసీపీకి 78,800 ఓట్లు రాగా టీడీపీకి 68,800 ఓట్లు వచ్చాయి. ఈ రెండు ఎన్నికలను పరిశీలిస్తే సగటు లెక్క తీసుకుంటే వైసీపీ కి 61 శాతం ఓట్లు నిక్కచ్చిగా ఉన్నట్లు చెప్పవచ్చు.
*ఈ ఎన్నికల్లో 68.12 శాతం పోల్ అయింది. పోల్ అయిన లక్షా 50వేల ఓట్లలో వైసీపీకి ఫిక్స్ డ్ ఓటింగ్ 60 నుండి 65 శాతం వేసుకుంటే 90 నుండి 95వేల వరకూ వైసీపీకి వచ్చే అవకాశం ఉంటుంది.
*ప్రస్తుతం రాష్ట్రంలో కొద్దిగా వైసీపీకి వ్యతిరేకత కనబడుతున్నప్పటికీ బద్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కావడం, ఈ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబ ఆధిపత్యం కారణంగా ఆ వ్యతిరేకత కనబడే అవకాశం లేదు. మరో విషయం ఏమిటంటే ప్రతిపక్షాలు చెబుతున్నంత వ్యతిరేకత ప్రభుత్వం మీద లేదు. దానికి తోడు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీ లేదు. అకాల మరణం చెందిన ఎమ్మెల్యే సతీమణి వైసీపీ అభ్యర్ధిగా బరిలో ఉండటంతో సానుభూతి కలిసి వచ్చే అంశం. ఈ కారణాల వల్ల వైసీపీ కి 60 శాతం అంటే 96వేల ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
*ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఫిక్స్ డ్ గా 40 నుండి 50వేల వరకూ ఓటింగ్ ఉంటుంది. ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్ధి లేకపోవడం వల్ల అందులో 50 నుండి 60 శాతం బీజేపీ అభ్యర్ధికి వేసినా కొంత శాతం వైసీపీ అభ్యర్ధికి పడే అవకాశం ఉంది. దీని వల్ల వైసీపీ అభ్యర్ధికి 90వేలకు తోడు మరో 15 నుండి 20వేల ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది.
*ఈ లెక్కన బీజేపీకి 15 నుండి 20వేల వరకూ పోల్ అయ్యే అవకాశం ఉంటుందని పరిశీలకుల లెక్క. అంచనా ప్రకారం 90 నుండి లక్ష మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి విజయం సాధించే అవకాశం ఉంది.
*ఇంత భారీ మెజార్టీతో వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉండగా,, వైసీపీ దొంగ ఓట్లు వేయించిందనే ఆరోపణలు వస్తున్నాయి. నూటికి నూరు శాతం గెలుపు ఖాయమైన ఈ నియోజకవర్గంలోనూ వైసీపీ దొంగ ఓట్లకు ఎందుకు పాకులాడింది అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. మెజార్టీ పెంచుకోవడానికి ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాలా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. దొంగ ఓట్ల ప్రభావం ఉంటే లక్ష మెజార్టీ ఖాయంగా కనబడుతోంది. దొంగ ఓట్ల ప్రభావం లేకపోతే 90వేల వరకూ మెజార్టీ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ లెక్క ఎంత వరకూ నిజం అనేది నవంబర్ 2వ తేదీన తేలనుంది.