BJP Protest: కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన ధర్నా నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటునకు ఇటీవల ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. అయితే ఈ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు ధర్నాను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు, బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది.
ధర్నా విరమించుకుని నేతలు టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు స్థలం వద్దకు వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా నేతలు, కార్యకర్తలు అక్కడే భైటాయించి ఆందోళన కొనసాగించారు. ఆందోళన విరమించాలని డీఎస్పీ నేతలను కోరినా వారు ఒప్పుకోకపోవడంతో పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.