AP CM YS Jagan: రాష్ట్రంలో వేలాది మంది అగ్రి గోల్డ్ బాధితులు తమకు డబ్బులు ఎప్పుడు వస్తాయా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గుడ్ న్యూస్ అందించారు. అగ్రి గోల్డ్ బాధితులకు నగదు పంపిణీ ఎప్పటి నుండి చేపట్టనున్నారో ఈ రోజు వెల్లడించారు. స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ నేడు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాల పంపిణీపై సమీక్ష జరిపారు.
ఆగస్టు 10న నేతన్న నేస్తం, ఆగస్టు 16న విద్యా కానుక పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్..అగ్రి గోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పారు. రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్స్ కు ఆగస్టు 27న ఇన్సెంటివ్ లు ఇస్తామనీ, ఆ మేరకు కలెక్టర్లు సన్నద్దంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.
వారానికి నాలుగు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించాలనీ గతంలో చెప్పాం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే సమస్యలు ఎలా తెలుస్తాయని సీఎం జగన్ ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంత మంది అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం ఫెర్మామెన్స్ బాగా లేని వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు బాగుండాలంటే తరచు తనిఖీలు జరగాలన్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లు, మున్సిపల్ కమిషనర్లు, ఐసీడీఎ పీవోలు, సబ్ కలెక్టర్ లు తనిఖీలు చేయాలని ఆదేశించారు.