ఓ వైపు పొత్తులతో టెన్షన్ టెన్షన్ గా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు పలు కీలక నియోజకవర్గాల్లో పార్టీ నేతలే రె బెల్స్ గా మారి పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేస్తున్నారు. ఇప్పటికే జనసేన , బీజేపీకి కలిపి చంద్రబాబు ఏకంగా 31 అసెంబ్లీ సీట్లతో పాటు 8 పార్లమెంటు స్థానాలు ఇచ్చారు. ఈ నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన టీడీపీ నేతలకు చంద్రబాబు సర్ది చెప్పలేకపోతున్నారు. ఎవ్వరిని ఒప్పించే ప్రయత్నాలు జరగడం లేదు. చంద్రబాబు బుజ్జగిస్తున్నా కూడా పార్టీ నేతలు అస్సలు వెనక్కు తగ్గడం లేదు.
ఈ క్రమంలోనే పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు రెబెల్స్ గా పోటీ చేస్తే అక్కడ టీడీపీ ఓడిపోయే ప్రమాదం నెలకొంది. ఇది ఇప్పుడు చంద్రబాబును బాగా టెన్షన్ పెట్టేస్తోంది. ఇలా రెబెల్స్ గా మారిన నాయకుల్లో డోన్లో ధర్మవరం సుబ్బారెడ్డి – పెనమలూరులో బోడే ప్రసాద్ – ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ – భీమిలిలో కోరాడ రాజబాబు – పెందుర్తి లో బండారు సత్యనారాయణ – నెల్లిమర్లలో కర్రోతు బంగార్రాజు కనిపిస్తున్నారు.
అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు కు కూడా చివరి క్షణంలో అయినా సీటు వస్తుందా ? అంటే డౌట్గానే కనిపిస్తోంది. సీటు రాని వారిలో బోడే ప్రసాద్ ఇప్పటికే చంద్రబాబు ఫొటో పెట్టుకుని అయినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటున్నారు. అదే జరిగితే పెనమలూరులో టీడీపీ గెలవదు. ఇక ధర్మవరంలో సుబ్బారెడ్డి సైతం మూడేళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడితే ఈ రోజు బాబు పక్కన పెట్టారని.. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసి తీరుతానని శపథాలు చేస్తున్నారు. అక్కడ ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఓడిపోవడం ఖాయం.
ఇక భీమిలి, నెల్లిమర్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పొత్తులో భాగంగా సీట్లు రాకపోతే పార్టీ వాళ్లే ఇండిపెండెంట్లు గా వేసి ఓడించే పరిస్థితి ఉంది. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సైతం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మూడేళ్లుగా ఎంతో చేశానని.. ఇప్పుడు తనకు సీటు ఇవ్వకపోతే తన సత్తా ఏంటో చూపిస్తా అంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు, టీడీపీని రెబెల్స్ బాగా టెన్షన్ పెట్టేస్తున్నారు.