సినీ హీరో నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, ఇటు లోకేష్కు స్వయానా తోడళ్లుడు అయిన గీతం విద్యా సంస్థల అధినేత మొతుకుమిల్లి శ్రీ భరత్ ఇప్పుడు ప్లాన్ బీ రాజకీయం అమలు చేస్తున్నట్టు విశాఖ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. శ్రీ భరత్ గత పార్లమెంటు ఎన్నికల్లో విశాఖ నుంచి టీడీపీ క్యాండెట్ గా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో భరత్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేతిలో కేవలం 3 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. విశాఖ నగరంలోని నాలుగు స్థానాలను టీడీపీ గెలుచుకున్నా కూడా విజయనగరం జిల్లాలోని ఎస్ కోట అసెంబ్లీ సీటు నుంచి వైసీపీకి భారీ మెజార్టీ రావడంతో భరత్ స్వల్ప తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.
గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా భరత్ పార్లమెంటు స్థానాన్నే అంటి పెట్టుకుని వస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ఈ సారి పార్లమెంటులో అడుగు పెట్టాలని ఎంతో పట్టుదలతో ఉన్నారు. అయితే ఈ సారి భరత్ సీటు కు గట్టి పోటీ నెలకొంది. ఇప్పటికే జనసేనతో టీడీపీ పొత్తు ..ఆ తర్వాత బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్న పరిస్థితి. ఈ రెండు పార్టీలు కూడా విశాఖ పార్లమెంటు సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేశాయి. చంద్రబాబు అనకాపల్లి సీటు జనసేనకు వదులుకున్నారు.
ఆ తర్వాత బీజేపీ కూడా పొత్తులోకి రావడంతో పవన్ తాను తీసుకున్న అనకాపల్లి పార్లమెంటు సీటును బీజేపీకి త్యాగం చేశారు. అయితే బీజేపీ విశాఖ సీటే తమకు కావాలని గట్టిగా పట్టుబడుతోంది. అక్కడ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన కంభంపాటి హరిబాబు ఎంపీగా గెలిచారు. ఇక గత ఎన్నికల్లోనూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి అక్కడ పోటీ చేశారు. ఒక వేళ ఎంపీ సీటు దక్కకపోతే శ్రీ భరత్ ప్లాన్ బీ కూడా వేసుకున్నారు.
భీమిలి నుంచి అసెంబ్లీకి పోటీ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. అందుకే చంద్రబాబు భీమిలి సీటును ఇంకా ప్రకటించలేదంటున్నారు. అవసరం అయితే గంటాను చీపురుపల్లికి అయినా పంపించేసి భీమిలి సీటును శ్రీ భరత్కే ఇవ్వాలన్నది బాబు ప్లాన్. ఇదంతా శ్రీ భరత్ కోసమే అని అంటున్నారు. ఇక భరత్ గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే భీమిలి నుంచి భరత్కు మంచి మెజార్టీ వచ్చింది. అందుకే భరత్ ఈ సారి ఎంపీ లేకపోతే ఎమ్మెల్యేగా అయినా గెలిచి చట్టసభలకు వెళ్లాలన్న పంతంతో ఉన్నాడని అంటున్నారు. మరి భరత్ ఆశలు ఎంత వరకు నెరవేరతాయో ? చూడాలి.