CM Jagan Karnool Tour: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప, కర్నూలు జిల్లాల్లో పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం కడప చేరుకున్న సీఎం వైెఎస్ జగన్ రాత్రి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి కల్యాణ మహోత్సవానికి హజరై ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్చించి స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. రాత్రి కడప ఆర్ అండ్ బీ అతిధి గృహంలో బస చేసిన సీఎం జగన్.. నేటి ఉదయం కడపలో రెండు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
నంద్యాల జాయింట్ కలెక్టర్ మౌర్య వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కడప ఆదిత్య ఫంక్షన్ హాలు నందు మేయర్ సురేష్ బాబు కుమార్తె ఐశ్వర్య వివాహా వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ప్రత్యేక విమానంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీలు సంజీవ్ కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. తదుపరి పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి నివాసానికి చేరుకుని నూతన వధూవరులైన చెరుకులపాడు వంశీధర్ రెడ్డి, ప్రియదర్శిని లను ఆశీర్వదించారు.
CM Jagan Karnool Tour: ముందస్తు అరెస్టులు
సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పలు ముందస్తు అరెస్టులు చేశారు. విద్యార్ధి యువజన సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దివ్యాంగురాలు సుభద్రబాయి, వామపక్ష నేతలను హౌస్ అరెస్టు చేశారు. దివ్యాంగురాలు సుభద్రబాయి గతంలో సీఎం పర్యటన సందర్బంలో కలిశారు. ఉద్యోగం ఇప్పించాలని సీఎం జగన్ కు ఆమె వినతి పత్రం అందించగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఈ రోజు మళ్లీ సీఎం జగన్ ను సుభద్రబాయి కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆమెను గృహ నిర్బంధం చేశారు.